
- మొత్తం 10 స్థానాల్లో 9 కైవసం
చండీగఢ్: హర్యానా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం10 మున్సిపల్ కార్పొరేషన్లలో తొమ్మిదింటిని బీజేపీనే కైవసం చేసుకుంది. మిగిలిన ఒక్క మున్సిపల్ కార్పొరేషన్లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. కాంగ్రెస్ మాత్రం ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ లోనూ విజయం సాధించలేదు. గురుగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి రాజ్ రాణి.. కాంగ్రెస్ అభ్యర్థి సీమా పహుజాపై లక్ష ఓట్ల తేడాతో గెలుపొందారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ -మోస్ట్ స్టేట్ లీడర్లలో ఒకరైన భూపిందర్ హుడాకు బలమైన కంచు కోట అయిన గురుగ్రామ్లో బీజేపీ విజయం సాధించడం విశేషం. రోహ్తక్ స్థానం నుంచి బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్దళ్, స్వతంత్ర అభ్యర్థి మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. బీజేపీ అభ్యర్థి రామ్ అవతార్ లక్షకు పైగా ఓట్లు సాధించి ఇక్కడ గెలుపొందారు.
కాగా, ఈ ఫలితాలపై హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ స్పందించారు. ట్రిపుల్-ఇంజిన్ ప్రభుత్వానికి ఆమోద ముద్ర వేసిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.