
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై అసెంబ్లీ, మండలిలో సర్కారును నిలదీయాలని బీజేఎల్పీ సమావేశంలో నిర్ణయించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలోని ఎల్పీ ఆఫీసులో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ స్పీచ్, ఇతర అంశాలపై అసెంబ్లీ, మండలిలో ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు, ప్రధానంగా ఆరు గ్యారంటీల అమలుకు నిధుల కేటాయింపుపై సర్కారుపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.