ఏడు హామీలతో బీజేపీ మ్యానిఫెస్టో ‘ఇంద్రధనస్సు’

ఏడు హామీలతో బీజేపీ మ్యానిఫెస్టో ‘ఇంద్రధనస్సు’
  • ఉచితంగా విద్య, వైద్యం అందించేలా హామీ
  • ఆయుష్మాన్ భారత్ రూ. 10 లక్షలకు పెంపు

హైదరాబాద్: కాంగ్రెస్ కు దీటుగా ఏడు గ్యారెంటీలతో బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చోయబోతోందని సమాచారం. దీనికి ఇంద్రధనస్సు అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. విద్యా, వైద్యానికి పెద్ద పీట వేస్తూ ఉంటే ఈ మ్యానిఫెస్టోను రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను రూపొందించామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కీలకమైన ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మోదీ అంగీకారం తెలుపడం, దీంతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూర్యాపేట సభలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించడం గెలుపునకు బాటలు వేస్తాయని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించడం లక్ష్యంగా తయారు చేసిన ఈ మేనిఫెస్టోకు ఈసారి ఇంధ్ర ధనస్సు అని నామకరనం చేసినట్టు సమాచారం ‘ప్రధాన మంత్రి నరేంద్రమోదీనే గ్యారెంటీ’తో బీజేపీ ఈ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించబోతుంది.

రేపు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌లో ఈ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. ప్రధానంగా ఉచిత విద్య, వైద్యంతో పాటు నిరుద్యోగులు, రైతులకు లబ్ధి చేకూర్చడం లక్ష్యంగా రూపొందించిన అంశాలతో ఈ మేనిఫెస్టోను తయారు చేసినట్టు సమాచారం. రైతులకు శుభవార్తగా వరి పంటకి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.3,100కి పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల ఆరోగ్య బీమాను రూ.10 లక్షల వరకు పెంచాలని బీజేపీ భావిస్తోంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వస్తున్న అమిత్‌ షా.. ఇవాళ రాత్రి 11గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11:30గంటలకు బేగంపేటలోని ఐటీసీ కాకతీయకు చేరుకొని రాత్రికి బస అక్కడే చేస్తారు. శనివారం ఉదయం 10.30 గంటలకు కత్రియా హోటల్ కు చేరుకుని బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.