బీజేపీ విధానాలతో ‘బ్యాంకింగ్’ ​సంక్షోభం.. జూనియర్​ ఉద్యోగులపై పని ఒత్తిడిని పెంచింది: రాహుల్​ గాంధీ

బీజేపీ విధానాలతో ‘బ్యాంకింగ్’ ​సంక్షోభం.. జూనియర్​ ఉద్యోగులపై పని ఒత్తిడిని పెంచింది: రాహుల్​ గాంధీ

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కారు క్రోనిజం (ఆశ్రిత పక్షపాతం), రెగ్యులేటరీ నిర్వహణ లోపంతో బ్యాంకింగ్​ సెక్టార్​ సంక్షోభంలో పడిందని కాంగ్రెస్​ ఎంపీ, లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ ఆరోపించారు. దీంతో జూనియర్​ ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిందని, వారు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. బీజేపీ సర్కారు తన బిలియనీర్​ స్నేహితుల కోసం రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు. 

కేంద్ర సర్కారు ఈ ఆర్థిక దుర్వినియోగం వల్ల వేలాది మంది నిజాయితీపరులైన నిపుణులపై ప్రభావం చూపిందన్నారు. చాలామంది ఉద్యోగులు నష్టపోయారని చెప్పారు. ఐసీఐసీఐ  బ్యాంకు మాజీ ప్రతినిధి బృందంతో తాను సమావేశమైన వీడియోను రాహుల్ ​గాంధీ ‘ఎక్స్’లో పోస్ట్​ చేశారు. కేంద్ర సర్కారు తీరుతో నష్టపోయిన ఉద్యోగుల తరఫున కాంగ్రెస్​ పోరాడుతుందన్నారు. పని ప్రదేశంలో వేధింపులు అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు.

 అన్యాయం జరిగితే సంప్రదించండి 

 782 మంది ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఉద్యోగుల తరఫున ఒక ప్రతినిధి బృందం తనను పార్లమెంట్​లో కలిసిందని రాహుల్​ గాంధీ తెలిపారు. వారు చెప్పిన విషయాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. బ్యాంకు ఆఫీసుల్లో వేధింపులు, బలవంతపు బదిలీలు, ఎన్​పీఏ ఉల్లంఘించినవారికి అనైతికంగా ఇచ్చిన రుణాల వివరాలను బహిర్గతం చేసినందుకు ప్రతీకారం వంటివి తన దృష్టికి తెచ్చారని తెలిపారు. ఇలాంటి వేధింపులతో ఇద్దరు సూసైడ్​కు పాల్పడడం తనను బాధించిందని చెప్పారు. అన్యాయానికి గురైన ఉద్యోగులెవరైనా తనను ఎప్పుడైనా సంప్రదించొచ్చని తెలిపారు.