పత్తాలేని టూరిజం బోట్లు.. మూన్నాళ్ల ముచ్చటేనా?

పత్తాలేని టూరిజం బోట్లు.. మూన్నాళ్ల ముచ్చటేనా?
  • పత్తాలేని టూరిజం బోట్లు.. బోసి పోయిన రిజర్వాయర్లు

నాగర్​కర్నూల్, వెలుగు : ప్రకృతి అందాలు, కృష్ణా నది తీర ప్రాంతాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బోటింగ్​ మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ఎకో టూరిజం, జంగిల్​ టూరిజం, రివర్ టూరిజంపై ఆసక్తి ఉన్న పర్యాటకులు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. గత ప్రభుత్వ హయాంలో టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్​ ఆర్బాటంగా ప్రారంభించారు. సోమశిల వద్ద కృష్ణా నదిలో, సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీవారి జలాశయంలో టూరిజం అధికారులు బోట్లను ఏర్పాటు చేశారు. 

అయితే బోట్లకు కట్టిన పూలు వాడకముందే మరోచోట ప్రారంభోత్సవం ఉందని బోట్లను ఇక్కడి నుంచి తరలించారు. నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు మధ్యలో ట్యాంక్​బండ్  తరహాలో బుద్ద విగ్రహం, లైటింగ్​ ఏర్పాటు చేశారు. అప్పటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి టూరిజం కార్పోరేషన్​ బోట్​ ఏర్పాటు చేసి చెరువులో చక్కర్లు కొట్టారు. ఆ తరువాత కేసరి సముద్రం చెరువులో లైట్లు వెలగలేదు. బోట్​ కనిపించలేదు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.

అంతా ఉత్తుత్తిదే..

గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి టూరిజం శాఖను నిర్వహించారు. నాగర్​ కర్నూల్​ జిల్లాలోని సోమశిల, అమరగిరి, సింగోటం, కేసరి సముద్రం చెరువులో బోటింగ్​ ప్రారంభించారు. అదే ఊపులో మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు, కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీంలోని గుడిపల్లిగట్లు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్​ లో నిర్మాణంలో ఉన్న కోయిల్​సాగర్, సరళా సాగర్, శంకర సముద్రం, శ్రీరంగాపూర్​ తదితర నోటిఫైట్(ట్యాంకులు) రిజర్వాయర్లలో బోటింగ్​ అభివృద్ది చేస్తామని ప్రకటించారు. ఇక మూడేండ్ల కింద సోమశిల వద్ద బోటింగ్​ను అప్పటి టూరిజం మంత్రి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

 లింగాల గట్టు వద్ద బోటింగ్​ ప్రారంభానికి సినీ నటుడు తనికెళ్ల భరణిని ఆహ్వానించారు. సింగోటం శ్రీవారి సముద్రం రిజర్వాయర్​ కట్టను ట్యాంక్​బండ్​గా మార్చి కాటేజీలు నిర్మించారు. ఇక్కడ బోటింగ్​ ప్రారంభించారు. మంత్రి ప్రారంభించిన వారం రోజుల పాటు వాటిని నడిపించిన టూరిజం ఆఫీసర్లు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ బోటింగ్​ ప్రారంభం ఉన్నా వీటినే అటు ఇటు తిప్పి చేతులు దులుపుకున్నారు. 

చివరికి సరైన నిర్వహణ, ఆపరేటర్లు లేక బోట్లను హుస్సేన్​ సాగర్​కు తరలించినట్లు సమాచారం. మంచాలకట్ట, మల్లేశ్వరం ఐలాండ్​ వరకు బోటింగ్​కు విపరీతమైన క్రేజీ ఉంది. నాగర్​ కర్నూల్​ జిల్లాతో పాటు ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని నోటిఫైడ్  ట్యాంకులు, రిజర్వాయర్లు, ట్యాంక్​బండ్​ల వద్ద బోటింగ్,​ టూరిజం డెవల్​ప్​మెంట్​కు ప్రాధాన్యత​ ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో లోకల్​గా ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని అంటున్నారు.

పర్యాటకులకు తప్పని తిప్పలు

కృష్ణా తీరాన కొండల నడుమ ఉన్న సోమశిల, అమరగిరి ప్రాంతాలు పర్యాటకులను మరో ప్రపంచంలోకి తీసుకుపోతాయి. సోమశిలలో టూరిజం కార్పొరేషన్​ ఏర్పాటు చేసిన లాంచీని శ్రీశైలం వరకు తిప్పుతామని ప్రకటించారు. ప్రస్తుతానికి నదిలో ఓ రౌండ్​ వేయడానికే పరిమితం చేశారు. ఇక్కడ అదనంగా కాటేజీలు నిర్మించి రివర్  బోటింగ్​ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించినట్లవుతుంది. పర్యాటకులు ప్రైవేట్​ బోట్లలో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. 

కొండల నడుమ సుడులు తిరిగే కృష్ణా బ్యాక్​వాటర్​తో అమరగిరి పర్యాటకులను ఆకర్షిస్తోంది. కొల్లాపూర్​ నుంచి అమరగిరి వెళ్లే రోడ్డు వర్షాలకు పూర్తిగా ధ్వంసం కావడంతో టూరిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. అమరగిరి నుంచి సోమశిల వరకు, శ్రీశైలం ప్రాజెక్ట్​ వైపు బోటింగ్​కు అవకాశాలున్నా పట్టించుకోవడం లేదు. సింగోటం శ్రీవారి సముద్రం రిజర్వాయర్​లో గతంలో ఏర్పాటు చేసిన బోటింగ్​ను తిరిగి ప్రారంభిస్తే నాగర్​ కర్నూల్, వనపర్తి, కల్వకుర్తి ప్రాంతాల నుంచి టూరిస్టులు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.