న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) తన టెక్ ఉద్యోగులను వచ్చే రెండేళ్లలో మూడు వేల మందికి పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇది ప్రస్తుతం ఉన్న 1,500 మంది టెక్ ఉద్యోగులతో పోలిస్తే రెండింతలు. స్పెషల్ ట్యాలెంట్ ఉన్నవారిని నియమించుకుంటామని, అలానే రెగ్యులర్ హైరింగ్లో కూడా టెక్ ఉద్యోగులను తీసుకుంటామని బీఓబీ సీఈఓ దేబదత్త చంద్ అన్నారు. టెక్నికల్ సమస్యలు తరచూ తలెత్తుతున్న బ్యాంకులపై ఆర్బీఐ రిస్ట్రిక్షన్లు పెడుతోంది. దీంతో బ్యాంకులు తమ ఐటీ టీమ్ను బలోపేతం చేస్తున్నాయి.
ఐటీ సర్వీస్లను అందించేందుకు అదనంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా నియమించుకుంటామని చంద్ అన్నారు. త్వరలో కస్టమర్ల కోసం జనరేటివ్ ఏఐతో పనిచేసే ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఈ ప్లాట్ఫామ్లో బ్యాంక్ అందిస్తున్న వివిధ సర్వీస్లు అందుబాటులో ఉంటాయన్నారు. టెక్ నెట్వర్క్ను బలోపేతం చేసేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడానికే రూ.2,000 కోట్లను బీఓబీ ఇన్వెస్ట్ చేస్తోందని చెప్పారు. 2023–24 లో ఐటీ, టెక్నాలజీ ఖర్చుల కోసం రూ.743 కోట్లను బ్యాంక్ కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60 కొత్త బ్రాంచులను ఓపెన్ చేస్తామని బీఓబీ ప్రకటించింది.