![లెక్కలంటే నాకు కూడా భయం ఉండేది.. సినీ నటి దీపికా పదుకొనే](https://static.v6velugu.com/uploads/2025/02/bollywood-actor-deepika-padukone-advised-the-students-to-tell-their-parents-and-peers-without-hiding-any-problems_4vj8kQ5mqR.jpg)
- లెక్కలంటే నేను కూడా భయపడేదాన్ని
- పరీక్షా పే చర్చలో దీపికా పదుకొనే
న్యూఢిల్లీ: ఎలాంటి సమస్యలు వచ్చినా దాచుకోకుండా తల్లిదండ్రులుకు, తోటివాళ్లకు చెప్పుకోవాలని బాలివుడ్ యాక్టర్ దీపికా పదుకొనే స్టూడెంట్లకు సూచించారు. భావాలను ఎప్పుడూ అణిచివేయొద్దని, స్నేహితులతోనో టీచర్లతోనో పంచుకోవాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ 8వ ఎడిషన్లో దీపికా పదుకొనే పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యంపై ఆమె స్కూల్ పిల్లలతో మాట్లాడారు. తాను కూడా ఒక దశలో డిప్రెషన్కు గురయ్యానని దీపికా పేర్కొన్నారు.
అయితే, దాన్ని ఎలా అధిగమించాలో స్టూడెంట్లకు వివరించారు. డిప్రెషన్నుంచి బయటపడేదెలా అనే విషయం గురించి చర్చించేందుకు చక్కని వేదికను అందించారంటూ ప్రధాని మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
నేనూ అల్లరి పిల్లనే..
ఈ సందర్భంగా దీపిక తన స్కూల్ డేస్ను గుర్తుచేసుకున్నారు. తాను స్కూల్లో టేబుల్స్, కుర్చీలు ఎక్కి అల్లరి చేసేదాన్నని చెప్పుకొచ్చారు. స్టూడెంట్గా ఉన్నప్పుడు సహజంగానే మానసిక ఒత్తిడికి గురవుతామని చెప్పారు.
లెక్కలు సరిగా రాక తానెంతో భయపడిపోయేదాన్నని వివరించారు. అయితే, ఆ భయాన్ని అధిగమించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని దీపిక ప్రస్తావించారు.
ఏదైనా సమస్య వస్తే లోపలే దాచుకొని కుంగిపోవద్దని, కుటుంబ సభ్యులు.. స్నేహితులకు చెప్పుకోవాలని సూచించారు. మన భావోద్వేగాలను బయటపెట్టేందుకు డైరీ రాయడం చక్కని మార్గమని చెప్పారు.