యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ క్రేజీ హీరోయిన్గా మారిన త్రిప్తి డిమ్రి.. ‘బ్యాడ్ న్యూజ్’ సినిమాతో గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో విక్కీ కౌశల్తో త్రిప్తి చేసిన రొమాంటిక్ సాంగ్ కారణంగా.. ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ, సినిమాకు మాత్రం మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘యానిమల్’తో నేషనల్ క్రష్గా గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి.. అలా పిలవడం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ఆ ట్యాగ్ విషయంలో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పింది. అయితే దాన్నొక ట్యాగ్గా మాత్రమే కాకుండా.. అభిమానుల ప్రేమగా చూస్తున్నానని, అది ఓ నటిగా తనపై మరింత బాధ్యతను పెంచిందని చెప్పిందామె.
ఇక కెరీర్ ప్రారంభించి ఏడేళ్లు పూర్తవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. గొప్ప నటీనటులు, దర్శకులతో పనిచేసే అవకాశం వస్తుందని అప్పట్లో తాను ఊహించలేదని చెప్పింది. ‘‘ఫస్ట్ మూవీ తర్వాత అదృష్టం ఉంటే రెండో సినిమా ఛాన్స్ రావొచ్చు అనుకున్నానే తప్ప యాక్టింగ్ను సీరియస్గా తీసుకోలేదు. అలాంటి టైమ్లో ‘లైలా మజ్ను’ ఆడిషన్లో పాల్గొన్నా. ఆ తర్వాతే యాక్టింగ్పై ఫోకస్ పెట్టా. నటనలో శిక్షణ తీసుకున్నా. దాంతో ప్రేక్షకులు కూడా నా నటనతో కనెక్ట్ అవుతున్నారు” అని త్రిప్తి డిమ్రి చెప్పింది.