నేడు టీపీసీసీ ప్రెసిడెంట్ రాక : మహేశ్ కుమార్​గౌడ్​

నేడు టీపీసీసీ ప్రెసిడెంట్ రాక :  మహేశ్ కుమార్​గౌడ్​
  • బాధ్యతలు చేపట్టి మొదటిసారి జిల్లాకు వస్తున్న మహేశ్ కుమార్​గౌడ్​
  • స్వాగతం పలకడానికి  కాంగ్రెస్ నేతల భారీగా ఏర్పాట్లు
  • పాత కలెక్టరేట్ గ్రౌండ్​లోబహిరంగ సభ 
  • రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్​చార్జి దీపా దాస్ మున్షి , మంత్రులు వచ్చే ఛాన్స్

నిజామాబాద్, వెలుగు: టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో మొదటిసారి బొమ్మ మహేశ్​కుమార్ గౌడ్ శుక్రవారం నగరానికి రానున్నారు. ఆయనకు స్వాగతం పలకడానికి పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వందలాది వాహనాలతో నగర శివారు నుంచి ర్యాలీ నిర్వహించి పాత కలెక్టరేట్ గ్రౌండ్లో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు జిల్లా వ్యాప్తంగా సుమారు 30 వేల మంది కార్యకర్తలు హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో గ్రాండ్ సక్సెస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు  చేశారు. 

 సాయిబాబా ఆలయంలో పూజలు

టీపీసీసీ అధ్యక్షుడు రానున్నందున నగరం అంతా కాంగ్రెస్ ఫ్లెక్సీలతో నింపేశారు. ప్రధాన కూడళ్ల వద్ద భారీ కటౌట్లు పెట్టారు.  హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు నగర శివారులోని మాధవ్ నగర్ చేరుకుంటారు.  సాయిబాబా మందిరంలో పూజల అనంతరం  ర్యాలీగా వినాయక నగర్ ఫులాంగ్ మీదుగా పాత కలెక్టరేట్ గ్రౌండ్ కు మధ్యాహ్నం 3 గంటలకు వస్తారు. 

ALSO READ | పేదలకు సన్నబియ్యం అందిస్తాం : మంత్రి సీతక్క

కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్ మున్షి, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు రానున్నారు. ప్రతీ సెగ్మెంట్  నాయకుడికి జన సమీకరణకు బాధ్యతలు అప్పగించారు. వాహనాల పార్కింగ్ కోసం పాత ఎంపీడీవో ఆఫీస్, ఎల్లమ్మ గుట్ట క్రాస్ రోడ్, పాత కలెక్టరేట్ మైదానంలోని కొంత భాగాన్ని కేటాయించారు.

కాంగ్రెస్​ శ్రేణులు తరలిరావాలి

కామారెడ్డిటౌన్, వెలుగు:  పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​కుమార్​గౌడ్​తొలిసారి కామారెడ్డి జిల్లా మీదుగా నిజామాబాద్​వెళ్తున్నందున ఆయనకు స్వాగతం పలికేందుకు  కాంగ్రెస్​శ్రేణులు తరలిరావాలని డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు పిలుపు ఇచ్చారు.  గురువారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ..  జిల్లా సరిహద్దు భిక్కనూరు మండలంలో నిర్వహించే ర్యాలీలో పార్టీ శ్రేణులు పాల్గొనాలన్నారు.  టోల్​గేట్​వద్ద ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ, జహీరాబాద్​ఎంపీ సురేశ్​షెట్కార్​ఆధ్వర్యంలో పీసీసీ ప్రెసిడెంట్​ను సన్మానించనున్నట్లు తెలిపారు.  బ్లాక్​ కాంగ్రెస్​ ప్రెసిడెంట్ గొనే శ్రీనివాస్,  లీడర్లు పంపరి లక్ష్మణ్, గుడుగుల శ్రీనివాస్,  లక్కపత్ని గంగాధర్,  బట్టు మోహన్, తేజపు ప్రసాద్, జమీల్​ పాల్గొన్నారు.