
పారిస్: డబుల్ వరల్డ్ చాంపియన్, ఇండియా స్టార్ బాక్సర్ ఒలింపిక్స్లో అద్భుత విజయంతో అరంగేట్రం చేసింది. మెగా ఈవెంట్లో మెడల్పై గురి పెట్టిన నిఖత్ పవర్ ఫుల్ పంచ్లు కొడుతూ విమెన్స్ 50 కేజీ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఆదివారం జరిగిన రౌండ్ 32లో 28 ఏండ్ల నిఖత్ 5–0తో జర్మనీ బాక్సర్ మాక్సి కారినా క్లోయెట్జర్ను చిత్తు చేసింది. ఈ బౌట్ తొలి రౌండ్లో నిఖత్ తడబడింది. క్లోయెట్జర్ పూర్తిగా ఎటాకింగ్ చేసి 3–2తో తొలి రౌండ్ గెలిచింది.
రెండో రౌండ్లో ఇరువురు బాక్సర్లు పోటాపోటీగా పంచ్లు విసురుకోగా.. రిథమ్లోకి వచ్చిన నిఖత్ ప్రత్యర్థిపై పదునైన హూక్ షాట్లు కొట్టింది. తెలివైన పంచ్లతో ఈ రౌండ్లో మెప్పించిన నిఖత్ ఆఖరి రౌండ్లోనూ స్పష్టమైన షాట్లతో ఆకట్టుకొని విజయం సాధించింది. 50 కేజీ ఈవెంట్లో కఠినమైన డ్రాలో నిలిచిన నిఖత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ ఆసియా, ఫ్లైవెయిట్ వరల్డ్ చాంపియన్ వు యు (చైనా)తో పోటీ పడనుంది. తొలి రౌండ్లో వు యుకు బై లభించింది. కాగా, శనివారం రాత్రి జరిగిన విమెన్స్ 54 కేజీ బౌట్లో ప్రీతి పన్వార్ 5–0తో వో తి కిమ్ అన్ష్ (వియత్నాం)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరింది.