
హైదరాబాద్, వెలుగు : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్కు 90 టీఎంసీల నికర జలాలు కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో నంబర్ 246పై ఏపీ దాఖలు చేసిన పిటిషన్ను బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. జస్టిస్ బ్రజేశ్ కుమార్, జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ తలపాత్రతో కూడిన ట్రిబ్యునల్ బుధవారం ఈమేరకు తీర్పునిచ్చింది. ఈ అంశంపై విచారించే న్యాయ పరిధి తమకు లేదని, ఏదైన ఇతర ఫోరమ్లో అప్పీల్ చేసుకోవాలని ఏపీకి సూచించింది.
ఈ ప్రాజెక్ట్ కొత్తదని, రాష్ట్ర విభజన తర్వాత చేపట్టింది కావడంతో దీనికి నీటి కేటాయింపులు చేసే హక్కు తమకు లేదని స్పష్టం చేసింది. ఏపీ పిటిషన్ను ట్రిబ్యునల్ తోసిపుచ్చడంతో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీకి సమర్పించిన డీపీఆర్ను పరిగణలోకి తీసుకునే అవకాశం ఏర్పడింది. అదే టైమ్లో ఈ ప్రాజెక్ట్ను కొత్తదిగా పేర్కొనడంతో అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి అయ్యింది.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చైర్మన్గా ఉండే అపెక్స్ కౌన్సిల్లో తెలంగాణ, ఏపీ సీఎంలు సభ్యులుగా ఉంటారు. అంటే, పాలమూరు ప్రాజెక్ట్ గట్టెక్కాలంటే ఏపీ సీఎం ఆమోదం కూడా తప్పనిసరి. దీంతో ట్రిబ్యునల్తీర్పుతో తెలంగాణకు కాస్త ఊరట దక్కినా.. అంతకు మించి న్యాయపరమైన చిక్కులను తెలంగాణ అధిగమించాల్సిన పరిస్థితి తలెత్తింది.