
- పెద్దపల్లి జిల్లాలో తోటి ఉద్యోగి నుంచి డబ్బులు తీసుకున్న ఇరిగేషన్ ఆఫీసర్లు
- వనపర్తి జిల్లాలో రూ. 10 వేలు తీసుకుంటూ దొరికిన ట్రాన్స్కో ఏఈ
సుల్తానాబాద్, వెలుగు : తమతో కలిసి పనిచేసే ఉద్యోగి నుంచే లంచం తీసుకున్న ఇద్దరు ఆఫీసర్లను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుక్నునారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో జరిగింది. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ వీవీ.రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... సుల్తానాబాద్ ఇరిగేషన్ శాఖ (ఎస్ఆర్ఎస్పీ) డివిజన్ 6 కార్యనిర్వాహక ఇంజినీర్ ఆఫీస్లో ఎండీ.ఇజాజ్ రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఇతడు అనారోగ్య సమస్యల కారణంగా గతేడాది ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 31 వరకు 88 రోజులు సిక్ లీవ్ పెట్టాడు.
ఈ కాలానికి సంబంధించి హాఫ్ పే లీవ్ (హెచ్పీఎల్) మంజూరు కోసం అప్లై చేసుకున్నాడు. ఫైల్ను క్లియర్ చేసేందుకు రూ. 20 వేలు ఇవ్వాలని సూపరిండెంట్ శ్రీధర్బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేశ్ డిమాండ్ చేశారు. దీంతో ఇజాజ్ ఈ నెల 19న కరీంనగర్లోని ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో ఇజాజ్ బుధవారం రూ. 20 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు సూపరింటెండెంట్ శ్రీధర్బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేశ్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి, ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. దాడుల్లో సీఐలు కృష్ణ, పున్నం చందర్ పాల్గొన్నారు.
పవర్ కనెక్షన్ ఇచ్చేందుకు రూ. 10 వేలు డిమాండ్
వనపర్తి, వెలుగు : ఓ రైస్ మిల్లుకు పవర్ కనెక్షన్ ఇచ్చేందుకు రూ. 10 వేలు లంచం డిమాండ్ చేసిన ఏఈని ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఖిల్లాఘనపురం మండలం మల్కాపూర్ గ్రామంలోని తిరుమల ఆగ్రో ఇండస్ట్రీస్ పేరుతో ఓ రైస్మిల్ను ఏర్పాటు చేశారు. ఈ మిల్లుకు 160 కేవీ పవర్ కనెక్షన్ కోసం మిల్లు కాంట్రాక్టర్ సలీం టీజీఎస్పీడీసీఎల్ ఏఈ కొండయ్యను సంప్రదించాడు. కనెక్షన్ ఇచ్చేందుకు ఏఈ రూ. 70 వేలు డిమాండ్ చేయడంతో రూ.50 వేలకు ఒప్పందం జరిగింది.
ఇందులో రూ. 30 వేలను గతంలోనే ఇవ్వగా మిగిలిన రూ.20 వేలు ఇవ్వాలని ఏఈ కాంట్రాక్టర్ను వేధిస్తున్నాడు. దీంతో అతడు మహబూబ్నగర్ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో బుధవారం వనపర్తిలోని ట్రాన్స్కో ఆఫీస్లో ఏఈ కొండయ్యను కలిసి రూ. 10 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఏఈని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏఈని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.