నా దెబ్బకు బ్రిక్స్​ ఆగం.. ఆ దేశాల మాటే వినిపించడంలేదు: ట్రంప్

నా దెబ్బకు బ్రిక్స్​ ఆగం.. ఆ దేశాల మాటే వినిపించడంలేదు: ట్రంప్
  • 150% టారిఫ్​ విధిస్తానని చెప్పగానే ఆ దేశాలు భయపడ్డయ్: ట్రంప్​
  • డాలర్​ను దెబ్బతీయాలనుకున్నయ్
  • కొత్త కరెన్సీని తెచ్చేందుకు ప్లాన్​ చేసినయ్​​​
  • బైడెన్​ ఉంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేదని కామెంట్​
  • కానీ తన నాయకత్వం దాన్ని అడ్డుకుంటుందని వెల్లడి

వాషింగ్టన్: తన దెబ్బకు బ్రిక్స్​ కూటమి ఆగమైపోయిందని అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ అన్నారు. డాలర్​కు ప్రత్యామ్నాయం తీసుకొస్తే ఆ దేశాలపై 150 శాతం టారిఫ్​ విధిస్తానని బెదిరించడంతో భయపడిపోయాయని తెలిపారు. ‘‘బ్రిక్స్​ దేశాలన్నీ కలిసి డాలర్​ను నాశనం చేయాలని అనుకున్నాయి. వారు కొత్త కరెన్సీ సృష్టించాలని అనుకున్నారు. నేను అధికారంలోకి రాగానే వారికి ఒకటే విషయం చెప్పాను. డాలర్​నాశనం గురించి మాట్లాడే ఏ దేశంపైనైనా 150 శాతం టారిఫ్​ విధిస్తానని హెచ్చరించా. 

అలాగే, ఆ దేశం నుంచి వస్తువుల దిగుమతిని ఆపేస్తామని చెప్పా. అంతే బ్రిక్స్​ దేశాలన్నీ చెల్లాచెదురైపోయాయ్​” అని వ్యాఖ్యానించారు. ‘‘అసలు వారికి ఏమైందో నాకు తెలియదు. ఇప్పుడు ఆ దేశాల మాటే వినిపించడం లేదు” అని వ్యంగ్యంగా అన్నారు. బ్రిక్స్​ ఒక చెడు ఉద్దేశంతో ఏర్పడిందని ఆరోపించారు. ఆ కూటమిలోని చాలామంది దాన్ని కోరుకోరని, ఇప్పుడు దానిగురించి మాట్లాడేందుకు కూడా ఇష్టపడడం లేదని చెప్పారు.  ఇప్పుడు బ్రిక్స్​ కూటమే చనిపోయిందని ఎద్దేవా చేశారు. 

బైడెన్ ఇంకో ఏడాది ఉంటే వరల్డ్​ వార్ 3​ వచ్చేదే

ఈసారి కూడా బైడెన్​అడ్మినిస్ట్రేషన్​ కొనసాగితే కచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చేదని ట్రంప్​ అన్నారు. వరల్డ్​ వార్​ ఎంతో దూరంలో లేదని హెచ్చరిస్తూనే.. దాన్ని తన నాయకత్వం నిరోధిస్తుందని చెప్పుకొచ్చారు. మియామిలో జరిగిన ఎఫ్​ఐఐ ప్రయారిటీ సమ్మిట్​లో ట్రంప్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మూడో ప్రపంచ యుద్ధం జరగడం వల్ల ఎవరికీ లాభం లేదు. అయినా వరల్డ్​ వార్​ ఎంతో దూరంలో లేదు. బైడెన్​ సర్కారు మరో ఏడాది కొనసాగితే ప్రపంచం యుద్ధంలో మునిగిపోయేది.  ఇప్పుడు అది జరగదు” అని పేర్కొన్నారు. 

ఈ యుద్ధాల్లో అమెరికా పాల్గొనకపోయినా.. తాను వాటిని ఆపేస్తానని చెప్పారు. అలాగే, రష్యా– ఉక్రెయిన్​యుద్ధంపైనా ట్రంప్​ స్పందించారు. ఈ యుద్ధం ముగింపునకు ఉన్నతస్థాయి చర్చలు ప్రారంభమైనట్టు చెప్పారు. గెలవలేని యుద్ధం కోసం అమెరికాతో  ఉక్రెయిన్​ప్రెసిడెంట్ జెలెన్​స్కీ​ 350 బిలియన్​ డాలర్లు ఖర్చు చేయించాడని మండిపడ్డారు. యుద్ధం ఆపేయాలని రష్యా కోరుకుంటున్నదని, త్వరలోనే తాను ఆ దేశ అధ్యక్షుడు పుతిన్​తో భేటీ కానున్నట్టు చెప్పారు.  

అమెరికాకు హాని చేస్తే సహించను: కాశ్​ పటేల్​

అమెరికాకు గుండె కాయ వంటి ఫెడరల్​ బ్యూరో ఆఫ్​ ఇన్వెస్టిగేషన్​(ఎఫ్ బీఐ)కు భారతీయ అమెరికన్ లీడర్ కాశ్ పటేల్ ను సెనేట్​ ఎన్నుకుంది.  ఈ నేపథ్యంలో కాశ్‌‌‌‌ పటేల్​ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే సహించబోమని అన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్‌‌‌‌ చేశారు. 

తనపై నమ్మకం ఉంచి.. కీలక బాధ్యతలు అప్పగించిన అధ్యక్షుడు డొనాల్డ్‌‌‌‌ ట్రంప్‌‌‌‌ , అటార్నీ జనరల్ పామ్‌‌‌‌ బోండికి  ధన్యవాదాలు తెలిపారు. ఎఫ్ బీ ఐకి ఎంతో ఘన చరిత్ర ఉన్నదని, దేశ ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేందుకు బ్యూరో కట్టుబడి ఉందని చెప్పారు.  దేశం గర్వించే విధంగా ఎఫ్‌‌‌‌బీఐని పునర్నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.