బ్రిటన్ ఎంపీలను అడ్డుకున్న ఇజ్రాయెల్

 బ్రిటన్ ఎంపీలను అడ్డుకున్న ఇజ్రాయెల్
  • తిరిగి లండన్‌కు పంపించిన అధికారులు 
  • ఇజ్రాయెల్ తీరుపై బ్రిటన్ ఫైర్

లండన్: బ్రిటన్‌కు చెందిన ఇద్దరు మహిళా ఎంపీలను ఇజ్రాయెల్ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. వాళ్లను తిరిగి లండన్‌కు పంపించారు. బ్రిటన్‌లోని అధికార లేబర్ పార్టీకి చెందిన మహిళా ఎంపీలు అబ్తిసం మహమ్మద్, యువాన్ యాంగ్ శనివారం ఇజ్రాయెల్ వెళ్లారు. పార్లమెంటరీ డెలిగేషన్‌లో భాగంగా వెస్ట్‌బ్యాంక్‌ను సందర్శించేందుకు వాళ్లు అక్కడికి వెళ్లారు. అయితే ఎయిర్‌‌పోర్టులో వాళ్లిద్దరినీ ఇజ్రాయెల్ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. తమ నిర్బంధంలో ఉంచారు. 

వాళ్లు వెస్ట్‌బ్యాంక్‌లో తమ భద్రతా దళాల కార్యకలాపాలను డాక్యుమెంట్ చేసేందుకు, తమ దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు వచ్చారని ఇజ్రాయెల్ అధికారులు ఆరోపించారు. అందుకే వాళ్లను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఎంపీలు ఇద్దరినీ తిరిగి లండన్‌కు పంపించామని ఆదివారం వెల్లడించారు. అంతకుముందు ఇజ్రాయెల్ అధికారులు తమను అడ్డుకున్నారని ఎంపీలు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. బ్రిటన్‌కు చెందిన చారిటీ సంస్థలు తమ ట్రిప్‌ను ఆర్గనైజ్ చేశాయని తెలిపారు. తాము చాలాసార్లు పార్లమెంట్‌లో ఇజ్రాయెల్‌, పాలస్తీనా సమస్యను లేవనెత్తామని.. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రాముఖ్యతను వివరించామని చెప్పారు.

 కానీ ఇజ్రాయెల్ తమను తప్పుగా అర్థం చేసుకుని అడ్డుకున్నదని పేర్కొన్నారు. కాగా, ఇజ్రాయెల్ తీరుపై బ్రిటన్ మండిపడింది. తమ ఎంపీలను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించింది. ఇలా ప్రవర్తించడం సరికాదని పేర్కొంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, బందీలను విడుదల చేయడం, గాజాలో శాంతి నెలకొల్పడం లాంటి అంశాలపైనే తమ ప్రభుత్వం దృష్టిసారించిందని బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ లామీ స్పష్టం చేశారు.