కుభీర్ మార్కెట్​లో ‘దళారీ’ దందా..!

కుభీర్ మార్కెట్​లో ‘దళారీ’ దందా..!
  • పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వ్యాపారులు
  •  లైసెన్సులు లేకున్నా..దర్జాగా కొనుగోళ్లు
  •  మార్కెట్ ఫీజు ఎగవేత
  •  2 శాతం క్యాష్ కటింగ్.. అడత్, హమాలీ పేరుతో కుచ్చుటోపీ

కుభీర్, వెలుగు : రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలకు కొందరు దళారులు గిట్టుబాటు ధర ఇవ్వకుండా వారిని ముంచుతున్నారు. లైసెన్సులు ఉండి మార్కెట్ యార్డులోనే కొనుగోలు జరపాలని రూల్స్​ఉన్నప్పటికీ.. దళారులు ఎక్కడ పడితే అక్కడ కాంటాలు ఏర్పాటు చేసుకొని కొనుగోలు చేస్తున్నారు. కొందరు లైసెన్సులు లేకున్నా దర్జాగా కొనుగోలు జరుపుతూ మార్కెట్ ఫీజు ఎగ్గొడుతున్నారు. కొందరు దళారులు రైతుల నుంచి 2 శాతం క్యాష్ కటింగ్, హమాలీ పేరుతో ఒక క్వింటాల్​కు మూడు కిలోల ధాన్యాన్ని కట్ చేస్తున్నారు.

ఆయా కటింగ్​ల కారణంగా సోయా రైతులు క్వింటాల్​కు సుమారు రూ.400 నష్టపోతున్నారు. మార్కెట్​లో వేసి గిట్టుబాటు ధర పొందుదామనుకుంటే ఆన్​లైన్​లో పంట నమోదు లేకపోవడంతో గత్యంతరం లేక దళారులకు అమ్ముకుంటున్నామని రైతులు వాపోతున్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో సోమవారం మార్కెట్​లో సోయా కొనుగోలు జరిపారు. అయితే కొనుగోలు చేయడానికి ముగ్గురు వ్యాపారస్తులు మాత్రమే ముందుకు వచ్చారు.

గవర్నమెంట్ రేట్ రూ.4982 ఉండగా రూ.4350 మాత్రమే చెల్లించారు. ఆన్​లైన్​లో చాలా మంది పేర్లు లేకపోవడం దళారులకు వరంగా మారింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మార్కెట్ ఫీజు చెల్లించకుండా అక్రమంగా కొనుగోలు జరిపే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవా లని రైతులు కోరుతున్నారు.