
- భావోద్వేగానికి గురైన ఫ్యామిలీ మెంబర్స్
వర్ధన్నపేట(ఐనవోలు), వెలుగు: చెల్లె పెండ్లికి తండ్రి లేడన్న వెలితిని తీర్చాడో అన్న. తండ్రి విగ్రహాన్ని చేయించి పెండ్లిలో గిఫ్ట్ గా అందజేశాడు. దీంతో అక్కడున్నవాళ్లంతా భావోద్వేగానికి గురయ్యారు. హనుమకొండ జిల్లా ఐనవోలుకు చెందిన వడిచెర్ల శ్రీనివాస్ గత ఏడాది జనవరి 22న చనిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతను అతడి కొడుకు కమల్హాసన్ తీసుకున్నాడు.
ఇటీవల చెల్లె శివాని పెండ్లి కుదరగా.. తండ్రి లేదన్న బాధ ఆమెను వేధించింది. దీంతో తన చెల్లికి తండ్రి లేడన్న వెలితిని తీర్చాలనే ఉద్దేశంతో కమల్ హాసన్ దాదాపు రూ.లక్షన్నర ఖర్చు పెట్టి ఎవరికీ తెలియకుండా తన తండ్రి ఫైబర్ విగ్రహాన్ని చేయించాడు. సోమవారం చెల్లెలు పెండ్లి జరగగా, విగ్రహాన్ని తన తల్లి అనురాధ సమక్షంలో గిఫ్ట్గా ఇచ్చాడు. తండ్రి విగ్రహాన్ని చూసిన వధువుతో పాటు పెండ్లిలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, బంధువులు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం విగ్రహం వద్ద ఫొటోలు దిగారు.