
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ను పేరును పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం రాత్రి ప్రకటించారు. సోమవారం దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించాల్సిందిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కేసీఆర్ ఆదేశించారు. సామాజిక సమీకరణాలు, ఉద్యమ చరిత్ర, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని దాసోజు పేరును ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అభ్యర్థిత్వం రేసులో పలువురి పేర్లు వినిపించగా, చివరి వరకు సస్పెన్స్ కొనసాగింది.
గిరిజన సామాజిక వర్గం ఆధారంగా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కే మళ్లీ టికెట్ ఇస్తారని తొలుత ప్రచారం జరిగింది. ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా పోటీలో ఉండటం, ఆయనపై మంచి అభిప్రాయం ఉండడంతో టికెట్ ఖాయమని అనుకున్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్లు కూడా వినిపించినా, చివరకు దాసోజు పేరును కేసీఆర్ ప్రకటించారు.