
- ఎలక్షన్ టూరిస్టులను నమ్మొద్దు
- బీఆర్ఎస్ హుస్నాబాద్ అభ్యర్థి సతీశ్కుమార్
హుస్నాబాద్, వెలుగు : గత పాలకుల హయాంలో సమస్యలతో తల్లడిల్లిన ఊర్లలో సకల సదుపాయాలను కల్పించామని, ఇప్పుడు ప్రజలంతా సంబురంగా ఉన్నారని బీఆర్ఎస్ హుస్నాబాద్అభ్యర్థి వొడితల సతీశ్కుమార్అన్నారు. ఎట్లున్న పల్లెలు ఎలా అభివృద్ధి చెందాయో ప్రజలు ఆలోచించి ఓటేయాలన్నారు. ఎలక్షన్ టూరిస్టులు వస్తుంటారు, పోతుంటారని, బీఆర్ఎస్ మాత్రం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. సోమవారం ఆయన సైదాపూర్ మండలం ఎలబోతారం, చింతలపల్లి, రాములపల్లి, రామచంద్రాపూర్, కురుమపల్లి, జాగీర్పల్లి, వెన్కేపల్లిలో ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిడ్మానేరుతో చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు, దేవాదులతో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు, శనిగరం, సింగరాయ ప్రాజెక్టులతో కోహెడ మండలం సస్యశ్యామలమైందని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ నాయకులు అడ్డుకున్నారని ఆరోపించారు. నీళ్లు రాకుండా ఎన్జీటీలో కేసులు వేయించారన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల అభివృద్ధి పనులు చేశానని, రూ.61కోట్లతో తండాలను డెవలప్ చేశానని, మొత్తం రూ.9వేల కోట్లతో నియోజకవర్గాన్ని నభూతోనభవిష్యత్ అన్నట్టు తీర్చిదిద్దానన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఈ అభివృద్ధిని కొనసాగించాలని కోరారు.
బీఆర్ఎస్లో చేరిన బీజేపీ కార్యకర్తలు
సతీశ్కుమార్ సమక్షంలో పలువురు బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి విజయపాల్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి కందుకూరి సతీశ్, హుస్నాబాద్ పట్టణ కార్యదర్శి వేముల శ్రావణ్, బీజేవైఎం అక్కన్నపేట మండల అధ్యక్షుడు కార్తిక్తో బీఆర్ఎస్లో చేరారు.