కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు : చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 26వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ బాలిన సురేశ్ ను ఇంతెజార్గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.1.15 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంతెజార్గంజ్ సీఐ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కమిట్ మెంట్ చిట్టీల పేరుతో వరంగల్, హన్మకొండకు చెందిన వంద మంది సభ్యుల నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్ సురేశ్ రూ.6 కోట్లు వసూలు చేశాడు.
సభ్యులకు చిట్టీ డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని ఈనెల 10న అతనిపై గాళిపల్లి శ్రవణ్ కుమార్, తైలం గౌతమ్ సాగర్ అనే వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేశారు. శనివారం తిలక్ నగర్లో కిరాయి ఇంట్లో ఉన్న అతనిని పోలీసులు అరెస్టు చేసి రూ.1.15 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎక్కువ వడ్డీలకు ఆశపడి చిట్టీల పేరుతో పెట్టుబడి పెట్టి మోసపోవద్దని డిపాజిటర్లకు పోలీసులు సూచించారు. సురేశ్ బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ఇంతెజార్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు.