
- మున్సిపల్ చైర్మన్పై బీఆర్ఎస్ కౌన్సిలర్ల అవిశ్వాసం
- అడిషనల్ కలెక్టర్ కునోటీస్ అందజేత
మెదక్, నర్సాపూర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన పదిహేను రోజులకే నర్సాపూర్లో పొలిటికల్ హీట్మొదలైంది. బీజేపీకి చెందిన నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ ను గద్దె దించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆయనపై అవిశ్వాసం ప్రకటిస్తూ వైస్ చైర్మన్ సహా 9 మంది కౌన్సిలర్లు శుక్రవారం మెదక్ అడిషనల్ కలెక్టర్ కు నోటీసు అందజేశారు. గత ఫిబ్రవరిలోనే మురళీ యాదవ్ను గద్దె దించేందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు.
అయితే అప్పట్లో కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా మళ్లీ ఇప్పుడు అవిశ్వాసం నోటీస్ ఇవ్వడం జిల్లాలో చర్చనీయాంశమైంది. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న నర్సాపూర్, మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కాగా 2020 జనవరిలో ఫస్ట్ టైం మున్సిపల్ ఎలక్షన్లు జరిగాయి. మొత్తం15 వార్డులు ఉండగా 8 వార్డుల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్లు, నాలుగు వార్డుల్లో బీజేపీ క్యాండిడేట్లు, మూడు వార్డుల్లో ఇండిపెండెంట్లు కౌన్సిలర్లుగా గెలిచారు. బీఆర్ఎస్ కు ఫుల్ మెజార్టీ రావడంతో ఆ పార్టీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ మురళీ యాదవ్ మున్సిపల్ చైర్మన్గా, 6వ వార్డు కౌన్సిలర్ నయీమొద్దీన్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెండై..
మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ హై కమాండ్పై అసంతృప్తితో ఉన్న మురళీ యాదవ్ గతేడాది ఆగస్టులో బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ పార్టీ హైకమాండ్, సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆయనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో మురళీ యాదవ్ గతేడాది అక్టోబర్ లో బీజేపీలో చేరారు. ఆయన వెంట ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా కమలం పార్టీలోకి
వెళ్లారు.
పదవి నుంచి దించాలని..
బీజేపీలో చేరినప్పటి నుంచి మురళీ యాదవ్ బీఆర్ఎస్ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. కారు గుర్తు మీద కౌన్సిలర్ గా గెలిచి చైర్మన్ పదవి పొంది బీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని ఆ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు జీర్ణించుకోలేదు. బీఆర్ఎస్ గుర్తుమీద గెలిచిన చైర్మన్ సహా ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలోకి వెళ్లగా, ఇండిపెండెంట్లుగా గెలిచిన మరో ముగ్గురు కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరడంతో మున్సిపల్ కౌన్సిల్లో ఆ పార్టీ బలం 8కి చేరింది.
మొత్తం 15 మంది కౌన్సిలర్లలో బీఆర్ఎస్కు మెజారిటీగా 8 మంది ఉండడంతోపాటు, అవసరమైతే ఎక్స్అఫీషియో సభ్యులైన స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఓటుతో చైర్మన్ పదవి దక్కించుకోవచ్చని భావించారు. గత ఫిబ్రవరిలో మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్పై అవిశ్వాసం ప్రకటిస్తూ వైస్ చైర్మన్ నయిమొద్దీన్ సహా 8 మంది కౌన్సిలర్లు కలిసి కలెక్టర్కు నోటీస్ అందజేశారు. అయితే అప్పట్లో దీనిపై కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
మరోసారి అవిశ్వాసం..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. నర్సాపూర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి గెలుపొందారు. 2020లో ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గ పదవీ కాలం ఇంకో 13 నెలలు ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మురళీ యాదవ్ను గద్దె దించేందుకు మరోమారు ప్రయత్నాలు మొదలు పెట్టారు. నర్సాపూర్6వ వార్డు కౌన్సిలర్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్ తో పాటు మరో 8 మంది కౌన్సిలర్లు కలిసి శుక్రవారం అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లుకు అవిశ్వాసం నోటీస్ అందజేశారు.
నయీమొద్దీన్తోపాటు1వ వార్డు కౌన్సిలర్ అశోక్ గౌడ్, 3వ వార్డు కౌన్సిలర్ ఇస్రత్ సిద్దీఖి, 7వ వార్డు కౌన్సిలర్ గొల్ల రుక్కమ్మ, 8వ వార్డు కౌన్సిలర్ పంబాల రాంచందర్, 9వ వార్డు కౌన్సిలర్ వంటెద్దు సునీత, 12వ వార్డు కౌన్సిలర్ చెల్మెటి లక్ష్మి,14వ వార్డు కౌన్సిలర్ తంగేడుపల్లి సరిత, 15వ వార్డు కౌన్సిలర్ పంబాల లలిత అవిశ్వాస నోటీస్పై సంతకాలు చేశారు. మొత్తం 15 మంది కౌన్సిలర్లలో 9 మంది బీఆర్ఎస్ వారుండగా, 6 గురు బీజేపీ వారున్నారు. తమకు మెజారిటీ ఉన్నందున అవిశ్వాసం మీటింగ్పెడితే తాము నెగ్గుతామన్న ధీమాలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు. అయితే అవిశ్వాసం నోటీస్ విషయంలో కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.