
- మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీరుపై ఎమ్మెల్సీ రవీందర్రావు ఫైర్
- హైకమాండ్కు ఫిర్యాదు చేస్తానని వెల్లడి
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఆదివారం పట్టణంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మానుకోటలో ఇప్పటికే బీఆర్ఎస్ లో ఐక్యత లేక, వర్గ విభేదాల మూలంగా పార్టీ భ్రష్టు పట్టిపోయిందని ఫైర్ అయ్యారు. రజతోత్సవసభ సమన్వయ బాధ్యతలను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు అప్పగించారని చెప్పారు.
సన్నాహక సమావేశాలు సక్రమంగా నిర్వహించడం లేదని, సమావేశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో వర్గ విభేదాల కారణంగా గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు ఓడిపోయారని పేర్కొన్నారు. పార్టీ రజతోత్సవ సమావేశాల్లోనూ ఐక్యత చాటకుండా, ఎవరికి వారుగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. మాజీ మంత్రి సత్యవతి తీరుపై పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఇప్పటికైనా అందరినీ కలుపుకొని పోతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, రవి, ఎడ్ల వేణు, తేళ్ల శ్రీనివాస్, మడత వెంకన్న, రఘు పాల్గొన్నారు.