
- ఎమ్మెల్యే రోహిత్రావుతో భేటీ
మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలో బీఆర్ఎస్కు మరో భారీ షాక్ తగలనుంది. బుధవారం 6వ వార్డు కౌన్సిలర్ రాగి వనజ భర్త అశోక్, 4వ వార్డు కౌన్సిలర్ నర్మద కొడుకు శ్రీధర్యాదవ్, 11వ వార్డు కౌన్సిలర్ సమియుద్దీన్, 29వ వార్డు కౌన్సిలర్ రుక్మిణి భర్త కృష్ణ, 32వ వార్డు కౌన్సిలర్ మానస భర్త గోదల సాయి.. స్థానిక క్యాంపు ఆఫీస్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావును కలిశారు.
మర్యాదపూర్వకంగానే తాము ఎమ్మెల్యేను కలిశామని వారు చెబుతుండగా.. పార్టీ మారేందుకే కలిశారన్న చర్చ నడుస్తోంది. కాగా ఇప్పటికే బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ గంగాధర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మేడి మధుసూదన్రావు, కౌన్సిలర్లు మేడి కల్యాణి, జయశ్రీ, వసంత్.. మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అడుగులు
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే, ఎన్ఎస్ఎఫ్ పునరుద్ధరణ కమిటీ మెంబర్ డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు తెలిపారు. బుధవారం స్థానిక క్యాంప్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మెదక్ మండల పరిధి మంబోజిపల్లిలోని మూత పడ్డ చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వానికి నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ లేఖ రాసిందని చెప్పారు.
2014 వరకు ఫ్యాక్టరీ నడిచిందని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015లో లే ఆఫ్ ప్రకటించి ఫ్యాక్టరీ మూసేశారన్నారు. మేనేజ్మెంట్ లే ఆఫ్ ప్రకటించి వేలాది మంది చెరుకు రైతులకు, కార్మికులకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని మాటిచ్చి దాన్ని అమలు చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలతో పునరుద్దరణ కమిటీ ఏర్పాటు చేసిందన్నారు.