- రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది: కేటీఆర్
- టకీటకీమంటూ రైతు భరోసా పడట్లేదు.. ఢిల్లీ వారి ఖాతాల్లో పడుతున్నయని కామెంట్
హైదరాబాద్, వెలుగు: తమ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధితో ప్రజల ఆస్తుల విలువ పెరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పట్టణాల అభివృద్ధి కుంటుపడిందని, ప్రజల ఆస్తుల విలువ భారీగా పడిపోయిందని చెప్పారు.
కొత్తగా కట్టాల్సింది పోయి.. హైడ్రా, మూసీ అభివృద్ధి పేరుతో కూల్చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. నల్గొండ పట్టణ అభివృద్ధికి రూ.700 కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ తెలిపారు.
ఆ జిల్లా మంత్రి తనను బచ్చాగాడు అంటున్నారని, సీనియర్ అయ్యుండి కూడా పట్టణాభివృద్ధిని ఆయన పట్టించుకోలేదని విమర్శించారు. టకీటకీమంటూ రైతు భరోసా పైసలు పడతాయని సీఎం రేవంత్ గప్పాలు కొట్టారని, మరి, ఆ పైసలు పడుతున్నాయా అని ప్రశ్నించారు. రైతులకేమో గానీ.. ఢిల్లీ వాళ్ల ఖాతాల్లో మాత్రం టకీటకీమని పైసలు పడుతున్నాయని ఆరోపించారు.
ఆర్థిక సర్వే నివేదిక కాంగ్రెస్కు చెంపదెబ్బ
కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సర్వే రిపోర్ట్ చెంపపెట్టు లాంటిదని కేటీఆర్ అన్నారు.అనేక అంశాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి పదేండ్ల తమ ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు. తెలంగాణ మోడల్ సక్సెస్ అయిందనేందుకు అదే సాక్ష్యమన్నారు. రాష్ట్రంలో 90 శాతానికిపైగా సాగు భూములకు నీళ్లు అందుతున్నాయని సర్వే తేల్చిందన్నారు.