
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు, గాంధీభవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్కు తగ్గట్టు తమపై కేసులు పెడితే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని, అప్పుడు వాళ్లందరిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రిటైర్అయి వెళ్లిపోయినా.. ట్రాన్స్ఫర్ అయి వేరేచోటుకు పోయినా వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల అక్రమ కేసులపై ట్రిబ్యునల్ వేస్తామని, జీవించే హక్కును ఉల్లంఘించిన వారందరిపైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు తమకు ఏ ఫేవర్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ‘దండం పెట్టి చెప్తున్నా.. డ్యూటీని నిబంధనలకు అనుగుణంగా చేయండి. అలాంటి వారికి మా ప్రభుత్వంలో మెడల్స్ ఇస్తాం’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస, రాబందుల పాలన నడుస్తున్నదని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు.
సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే టార్గెట్ చేస్తున్నారు
సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని రేవంత్ టార్గెట్ చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలు, ప్రభుత్వ శాఖలు, కంపెనీలను కాపాడటానికి ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరోను.. రేవంత్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. దానిని బీఆర్ఎస్ సోషల్ మీడియాపై ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. కొందరు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు.. రేవంత్ తొత్తులుగా పనిచేస్తూ కాపీ పేస్ట్ ఎఫ్ఐఆర్లను నమోదు చేస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి హరీశ్ రావును పెట్రోల్ పోసి చంపుతామన్న కాంగ్రెస్ నేత మైనంపల్లిపై పోలీసులు కేసు ఎందుకు పెట్టలేదని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు.