
- కమీషన్ ఇచ్చినోళ్ల పేర్లనే ఎంపిక
- చేవెళ్ల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిపై సొంత పార్టీ ఎంపీపీ తీవ్ర ఆరోపణలు
చేవెళ్ల, వెలుగు: బీఆర్ఎస్లో బీసీ బంధు చిచ్చుపెట్టింది. చేవెళ్ల మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ అక్రమాలకు పాల్పడ్డారని ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. గురువారం ఆమె వాట్సప్ గ్రూప్ వేదికగా మండిపడ్డారు. దీంతో చేవెళ్ల వాట్సప్ గ్రూపుల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడిపై విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రభాకర్ డబ్బులు ఇచ్చిన వారి పేర్లతోనే జాబితా తయారు చేశారని, ప్రజాప్రతినిధులుగా తమ గ్రామంలోని పేదల పేర్లు ఇచ్చినా పట్టించుకోలేదని, అర్హులైన పేదలకు కాకుండా.. తన అనుచరులు, బంధువుల పేర్లను ఎంపిక చేశారని ఆమె ఆరోపించారు. గతంలో దళితబంధుపైనా ఇలానే చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేద దళితులకు అన్యాయం చేసి.. ఉన్నోళ్లకే యూనిట్లు ఇచ్చారని మండిపడ్డారు. ఇలా అయితే ప్రభుత్వ లక్ష్యం ఎలా నెరవేరుతుందని ప్రశ్నించారు. దళితబంధు, బీసీబంధుపై ఎమ్మెల్యే యాదయ్య వెంటనే స్పందించాలని, లేదంటే పార్టీకి నష్టం తప్పదని ఆమె హెచ్చరించారు.
వాట్సాప్ వేదికగా బయటపడ్డ విభేదాలు
ఎంపీపీ విజయలక్ష్మి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ మధ్య విభేదాలు వాట్సప్ వేదికగా బయటపడడంతో చర్చ జోరుగా నడుస్తుంది. ఆయన ఎమ్మెల్యే యాదయ్యకు కుడిభుజంగా ఉంటాడనే పేరు ఉంది. ఈ పథకాలతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి స్కీమ్స్, అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రోగ్రామ్ల నిర్వహణ ఆయనకే ఎమ్మెల్యే అప్పజెప్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎంపీపీ పంపిన బీసీ బంధు పేర్లు తిరస్కరించాలనే ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో బీసీ, ఎంబీసీ కులాలకు ఎమ్మెల్యే కాలే యాదయ్య బీసీబంధు చెక్కులను పంపిణీ చేశారు.