
- ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే
- పట్టున్న డోర్నకల్లోనూ చేజారుతున్న క్యాడర్
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో సిట్టింగ్ ఎంపీ మాలోతు కవితకు బీఆర్ఎస్ నుంచి కొనసాగుతున్న వలసలు తలనొప్పిగా మారాయి. మరోసారి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కవిత పోటీ చేయనుండగా.. తన తండ్రి మాజీ మంత్రి రెడ్యానాయక్కు గట్టి పట్టున్న డోర్నకల్ నుంచి కాంగ్రెస్లోకి నేతలు వెళుతుండటం కలవరపెడుతోంది. ఎంపీ టికెట్ ప్రకటించిన తర్వాత మండలాల వారీగా బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్లు పెడుతున్నా నేతల వలసలను ఏ మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు.
కాంగ్రెస్లో చేరనున్న నూకల...!
డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, నూకల నరేశ్ రెడ్డి ఈ నెల17న కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు కీలక నేతలు కూడా హస్తం పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. నరసింహులపేట, దంతాలపల్లి, మరిపెడ మండలాల నుంచి ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు కారు దిగి కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమైపోయింది.
గులాబీ నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ రామసహయం సురేందర్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం మరింతగా పెంచే దిశగా ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల నూకల నరేశ్ రెడ్డి సొంత గ్రామం పురుషోత్తమాయ గూడెంలో నిర్వహించిన హోమంకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, విప్ రాయంద్రు నాయక్ హాజరయ్యారు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో చేరికలకు
మార్గం సుగమమైంది
క్యాడర్లో కనిపించని జోష్
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటమి చెందడం, కీలక నేతలు పార్టీ మారడంతో బీఆర్ఎస్ నేతల్లో జోష్ తగ్గింది. మహబూబాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలిగా ఎంపీ కవిత కొనసాగుతున్నా పార్టీ నుంచి వలసలను కంట్రోల్చేయలేకపోతున్నారు. మున్సిపాలిటీల పరిధిలో అవిశ్వాస గండంను తప్పించుకోవడం కోసం చైర్మన్, వైస్చైర్మన్, కౌన్సిలర్లు కాంగ్రెస్ బాట పడుతున్నారు.
బీఆర్ఎస్ గ్రాఫ్పడిపోతుంది
మహబూబాబాద్ పార్లమెంట్పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 2,41,987 ఓట్ల మెజార్టీని కాంగ్రెస్ సాధించింది. డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపొందగా భద్రాచలం నుంచి బీఆర్ఎస్ గెలిచినా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.