
- ఒక్క బయ్యారం మండలానికి రూ. కోటి ఎలా కేటాయిస్తారు ?
- వాడీవేడిగా మహబూబాబాద్ జడ్పీ మీటింగ్
మహబూబాబాద్, వెలుగు: ‘జడ్పీ నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారు.. చైర్పర్సన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తన మండలానికి ఎక్కువ నిధుల కేటాయించుకుంటున్నారు’ అని అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీలు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు అధ్యక్షతన సోమవారం జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతూ జడ్పీ నిధుల కేటాయింపులో వివక్ష కొనసాగుతోందని, చైర్పర్సన్ ఆంగోత్ బిందు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బయ్యారం మండలానికి రూ. కోటి కేటాయించి, ఇతర మండలాలపై వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీటీసీలకు ప్రభుత్వ కార్యక్రమాల్లో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ వాగ్వాదానికి దిగారు. మరిపెడ జడ్పీటీసీ తేజావత్ శారద నేలపై కూర్చుని నిరసన తెలిపారు. అనంతర్ తొర్రూర్ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ మైనింగ్ కొనసాగుతోందని, రాళ్ల తరలింపు టైంలో రూల్స్ పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆర్టీఏ, మైనింగ్ ఆఫీసర్ల మధ్య కో ఆర్డినేషన్ లేకపోవడంతో రాళ్ల తరలింపు యథేచ్ఛగా కొనసాగుతోందన్నారు. అనంతరం కలెక్టర్ కలెక్టర్ శశాంక మాట్లాడుతూ సభ్యులు చెప్పిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, జడ్పీ సీఈవో రమాదేవి పాల్గొన్నారు.
అందరికీ సమానంగా నిధులిస్తాం
జడ్పీ నిధుల కేటాయింపులో అన్ని మండలాలకు సమాన ప్రాధాన్యం ఇస్తామని, సభ్యులెవరూ ఆందోళన చెందొద్దని జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు చెప్పారు. జడ్పీ మీటింగ్లో సభ్యులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు ఆఫీసర్లు కృషి చేయాలని సూచించారు. కో ఆర్డినేషన్తో పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు.
తాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలి
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ఆఫీసర్లు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శంకర్నాయక్ సూచించారు. పీఆర్ రోడ్ల నిర్మాణ పనులను స్పీడప్ చేయాలని చెప్పారు. ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు కలిసి అభివృద్ధి చెందేలా ముందుకు సాగాలని సూచించారు.