హైదరాబాద్, వెలుగు: పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధాన అనుచరులు, బీఆర్ఎస్ మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో ఉన్న చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్యకర్తలు భారీగా మంగళవారం కాంగ్రెస్లో చేరారు. గాంధీ భవన్లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ.. ఊరూరా కాంగ్రెస్లో చేరికలతో బీఆర్ఎస్ను ఖాళీ చేస్తామని చెప్పారు. పార్టీలోకి కొత్తవారు వస్తున్నందున పాతవాళ్లు ఎవరూ పరేషాన్ కావద్దన్నారు. పార్టీ కోసం చాలా ఏండ్లుగా కష్టపడుతున్న నాయకులను గుర్తుపెట్టుకుంటామని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో లక్ష మెజారిటీని కాంగ్రెస్కు అందించేలా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.