![అరెకపూడిని పీఏసీ ఛైర్మన్గా ఊహించుకోలేం..ఇంకా 30 మీటింగ్ లైనా బహిష్కరిస్తాం: గంగుల](https://static.v6velugu.com/uploads/2025/02/brs-leaders-gangula-kamalakar-and-vinodh-kumar-who-boycotted-the-pac-meeting_yIRoizuKBj.jpg)
కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీలో పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ అధ్యక్షతన జరుగుతోన్న(పీఏసీ) పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీటింగ్ ను బీఆర్ఎస్ సభ్యులు మాజీ మంత్రి గంగుల, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ వాకౌట్ చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు వేముల ప్రశాంత్ రెడ్డి. హరీష్ రావు వేసిన నామినేషన్ ను మాయం చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత అభిప్రాయం తీసుకునే సంప్రదాయాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కింది.. అందుకే పీఏసీ సమావేశాన్ని బహిష్కరించామన్నారు.
ఇంకా ముప్పై మీటింగ్ లైనా బహిష్కరిస్తాం: గంగుల
అరెకపూడి గాంధీ వెన్ను పోటు దారుడు. ఆయనను పీఏసీ చైర్మన్ గా ఊహించుకోలేము. మూడు మీటింగ్ లు బహిష్కరించాం. ఇంకా ముప్పై మీటింగ్ లైనా బహిష్కరిస్తాం. పీఏసీ సమావేశాల్లో కూడా మైక్ కట్ చేస్తున్నారు. నేను గతంలో పలు అసెంబ్లీ కమిటీల్లో పని చేశాను. ఇలాంటి సంప్రదాయం ఎప్పుడూ చూడలేదు. తప్పు చేయటం ఎందుకు అని అన్నారు గంగుల.
మేమంతా నిరాశ,నిస్పృహలో ఉన్నం: వినోద్
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ నేతలం నిరాశ, నిస్పృహలో ఉన్నాం. ఉన్న మాటే చెప్తున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం లేదు. ఓటరు నమోదు కార్యక్రమంలో మేము పాల్గొనలేదు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో తప్పిదాలున్నాయి. గతంలో కూడా బీఆర్ఎస్ పోటీ చేయని సందర్భాలున్నాయి. మోదీ సర్కార్ వెంటనే దేశంలో జనాభా లెక్కింపు జరపాలి. కుల గణన నుంచి తప్పించుకోవటానికే మోదీ జనగణన చేయటంలేదు. డీ లిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు నుంచి తప్పించుకోవాలని కేంద్రం చూస్తోంది. డీ లిమిటేషన్ జరిగితే తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి.
ALSO READ | ఏపీ కుల సర్టిఫికెట్లు తెలంగాణలో చెల్లవా.? హైకోర్ట్ ఏం చెప్పింది
2026లో అసెంబ్లీ సీట్లు పెరుతాయని విభజన చట్టంలో ఉంది. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కొవిడ్ వలన వాయిదా పడ్డాయి. 8వేల కోట్లు అవసరం ఉంటే.. జనాభా లెక్కల కోసం కేంద్ర బడ్జెట్ లో 574 కోట్లు మాత్రమే కేటాయించారు. గుడ్డి ఎద్దు చేనులో పడినట్లు.. మోదీ పాలన చేస్తున్నారు. 2011లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. పేదలకు రేషన్ ఇవ్వటం ఇష్టంలేకనే జనాభా లెక్కలకు వెనకడు వేస్తున్నారు. జనాభా లెక్కింపు జరిపితే కొత్తగా 10కోట్ల మందికి కొత్త రేషన్ కార్డులు వస్తాయి.