ఎన్​డీఎస్ఏతో దర్యాప్తు చేయించాలి .. ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేతల డిమాండ్​

ఎన్​డీఎస్ఏతో దర్యాప్తు చేయించాలి .. ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేతల డిమాండ్​
  • ప్రమాదానికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్​దే: కేటీఆర్​
  • మట్టికూలుతున్నదని గుర్తించినా చర్యలు తీసుకోరా?: హరీశ్​ రావు
  • పనులు మొదలుపెట్టిన వెంటనే ప్రమాదం ఎలా జరిగింది?: కవిత

హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్​బీసీ ప్రమాదంపై నేష నల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ)తో దర్యాప్తు చేయించాలని బీఆర్ఎస్​ నేతలు డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. శనివారం ప్రమాదంపై బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే హరీశ్​ రావు ‘ఎక్స్’లో  ట్వీట్​ చేశారు. టన్నెల్​ ప్రమాదానికి పూర్తి బాధ్యత రేవంత్​ రెడ్డిదేనని కేటీఆర్ ​అన్నారు. 

సుంకిశాల రిటైనింగ్​ వాల్​ కూలి న ఘటన మరువకముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్​ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. టన్నెల్​ లోపల చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఒక బ్యారేజీలోని పిల్లర్​ కుంగితే నానా హంగామా చేసిన కాంగ్రెస్​ నేతలు.. వారి ప్రభుత్వంలో జరుగుతున్న ప్రమాదాలపై ఏమంటారని ప్రశ్నించారు. ఎస్​ఎల్​బీసీ ప్రమాదంపై పారదర్శకంగా దర్యాప్తు జరిపించి, కారణాలను బయటపెట్టాలని డిమాండ్​ చేశారు. 

ప్రభుత్వ చేతగానితనమే: హరీశ్​రావు

కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న ఎస్​ఎల్​బీసీ టన్నెల్​ కూలిపోవడం కాంగ్రెస్​ అసమర్థ, చేతగాని పాలనకు నిదర్శనమని హరీశ్​ రావు అన్నా రు. చేయక చేయక ఒక ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి ఆరంభంలోనే అంతం చేసిన ఘనత కాంగ్రెస్ పాలకులదేనని ఎద్దేవా చేశారు. దీనిపై ఎన్​డీఎస్​ఏతో దర్యాప్తు చేయించాలని డిమాండ్​ చేశారు. కొద్ది రోజులుగా మట్టి కూలుతున్నదని గుర్తించినా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు.

 ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. లోపల చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకురావాల ని కోరారు. ఎస్​ఎల్​బీసీ టన్నెల్ ఘటనపై ఎన్​డీఎస్​ఏ స్పందించాలని కవిత అన్నారు. పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించారు. కేసీఆర్​ హయాంలో 10 కిలో మీటర్ల మేర టన్నెల్​ తవ్వినా.. ఎప్పుడూ ఇలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వం 4  రోజుల కిందటే పనులు పెట్టినా.. ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించారు. దానికి బాధ్యులెవరో ఎన్​డీఎస్​ఏ తేల్చాలని కోరారు.