
- పార్టీ సభ్యత్వం ఇచ్చిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల
- ఇన్ చార్జ్ తరుణ్చుగ్, లక్ష్మణ్, రాజీవ్ చంద్రశేఖర్
- ఇటీవలే బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన పెద్దపల్లి ఎంపీ, బీజేపీలో చేరిన నాగర్కర్నూల్ ఎంపీ
న్యూఢిల్లీ / సంగారెడ్డి, వెలుగు: బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. తాజాగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇటీవలే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత బీఆర్ఎస్కు రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరగా.. నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కూడా రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. శుక్రవారం బీబీ పాటిల్కు ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సభ్యత్వం ఇచ్చి స్వాగతం పలికారు. తర్వాత బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు.
జాయినింగ్ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ పదేండ్లలో చేసిన ప్రగతిని చూసి పాటిల్ బీజేపీలో చేరారని, ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. మూడేండ్లలో కేసీఆర్ కుటుంబ అవినీతి రాజకీయాలు నచ్చని దాదాపు 60 మందికి పైగా నేతలు తమ పార్టీలో జాయిన్ అయినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, ఆ పార్టీ పేరును... బాప్, బేటా, బేటీ(బీబీబీ) పార్టీ గా మార్చుకోవాలి అన్నారు. అందులో వాళ్ల కుటుంబ సభ్యులు, వారి వెనుక నడిచేటోళ్లు మాత్రమే మిగిలారని ఎద్దేవా చేశారు.
బంగారు తెలంగాణ కోరుకునే వారు బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. అసత్య హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పై మూడు నెలల్లోనే వ్యతిరేకత మొదలైందన్నారు. తర్వాత ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీజేపీలో చేరినట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని. కీలక బిల్లులను ప్రవేశపెట్టిందన్నారు. మోదీ నేతృత్వంలో బీజేపీలో పని చేస్తానన్నారు. దేశాన్ని మోడీ ఆత్మనిర్భర్ భారత్ గా నిలిపారని అన్నారు..
బీఆర్ఎస్లో రోజుకో వికెట్ డౌన్: లక్ష్మణ్
బీఆర్ఎస్ పార్టీ రెక్కలు తెగిన పక్షిలా తయారైందని కె.లక్ష్మణ్ అన్నారు. ఆ పార్టీ రోజుకో ఎంపీ వికెట్ కోల్పోతుందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయమని, గడిచిన చరిత్రని అన్నారు. బీఆర్ఎస్ నుంచి మరింత మంది బీజేపీ వైపు చూస్తున్నారని, ఆ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి.. ప్రజల నమ్మకం.. విశ్వాసం అని చెప్పారు.
బీఆర్ఎస్ నేతల ప్రాజెక్టుల పర్యటన ఒక డ్రామా అని కొట్టిపారేశారు. లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతుందన్నారు. సామాజిక కోణాలు, గెలుపు అవకాశాలు దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు.
బీఆర్ఎస్లో ఆందోళన
వరుసగా ముగ్గురు బీఆర్ఎస్ సిట్టింగ్ఎంపీలు పార్టీ మారడంతో గులాబీ శిబిరంలో కలవరం మొదలైంది. ముగ్గురు ఎంపీలు పార్టీ మారడానికి బీఆర్ఎస్ పెద్దల వ్యవహార శైలి కారణమని కార్యకర్తలు అంటున్నారు. ఇన్నాళ్లు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వకపోవడం, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను సుప్రీంలుగా మార్చడంతో ఎంపీలుగా ప్రత్యామ్నాయం చూసుకున్నట్టు చెప్తున్నారు. రెండు సార్లు ఎంపీగా ఉన్న పాటిల్కు తన పార్లమెంట్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి ఏనాడూ సహకరం అందలేదని, తమ సెగ్మెంట్లలో పాటిల్ను అడుగు పెట్టనీయకుండా ఎమ్మెల్యేలు ఇబ్బంది పెట్టేవారని ఎంపీ అనుచరులు చెప్తున్నారు. ఈ విషయంపై అప్పట్లోనే హైకమాండ్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో చాలాకాలంగా ఆయన సైలెంట్ గా ఉంటూవచ్చారు. సమయం కోసం చూస్తున్న ఆయన పార్లమెంట్ఎన్నికల వేళ గులాబీ పార్టీకి గుడ్బై చెప్పారు.