సూర్యాపేటలో 20 ఎకరాలు ఆక్రమించిన బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు

సూర్యాపేటలో 20 ఎకరాలు ఆక్రమించిన బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు
  • ఫేక్‌‌ డాక్యుమెంట్లు, నకిలీ బిల్లులతో రెగ్యులరైజేషన్‌‌
  • కబ్జాలో మాజీ మంత్రి కుటుంబ సభ్యులు, ముఖ్యనాయకులు
  • ఎంక్వైరీలో బయటపడ్డ అక్రమాలు
  • మూడు నెలలు దాటినా చర్యలు చేపట్టని ఆఫీసర్లు

సూర్యాపేట, వెలుగు : కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా, ఆక్రమణలు నిజమేనని తేలినా చర్యలు తీసుకునేందుకు ఆఫీసర్లు వెనుకడుగు వేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడలో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు ఆక్రమించి రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. ఫేక్‌‌‌‌‌‌‌‌ డాక్యుమెట్లు సృష్టించి రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారని మూడు నెలల కిందే ఆఫీసర్లు తేల్చారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కబ్జాలు నిజమేనని తేలినా పట్టాలు ఎందుకు క్యాన్సిల్‌‌‌‌‌‌‌‌ చేయడం లేదని, అక్రమార్కులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
 
రూ. 30 కోట్ల విలువైన 20 ఎకరాలు కబ్జా

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌ 126లోని 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ భూములకు భారీ ధర పలుకుతుండడంతో భూమిని దక్కించుకునేందుకు పలువురు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు స్కెచ్‌‌‌‌‌‌‌‌ వేశారు. ఇందులో భాగంగా ముందుగా భూమిని కబ్జా చేసి, ఆ తర్వాత నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయడంతో పాటు, ఇండ్లు లేకున్నా ఉన్నట్లు ఫొటోలు తయారు చేయించారు. అనంతరం జీవో నంబర్‌‌‌‌‌‌‌‌ 59 కింద భూమిని రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేయాలని గతేడాది ఫిబ్రవరిలో అప్లై చేసుకున్నారు. మొత్తం 73 మంది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు, ప్రజాప్రతినిధులు రెగ్యులరైజేషన్‌‌‌‌‌‌‌‌ కోసం గతేడాది ఆగస్ట్‌‌‌‌‌‌‌‌లో ఒకే రోజు మీ సేవలో దరఖాస్తు పెట్టుకున్నారు. తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే అప్పటి తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ రంగారావు భూమిని రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేసేశారు. ఇలా రూ. 30 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. 

జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఫ్యామిలీకి.. క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ సిబ్బందికి...

మాజీ మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఫ్యామిలీకి చెందిన ముగ్గురి పేరున సుమారు 600 గజాలను రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేయించుకున్నారు. అలాగే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఒక లీడర్‌‌‌‌‌‌‌‌ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు 4 వేల గజాలు, అలాగే తల్లీకూతురు పేరున రెండు ఎకరాలను రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు చెందిన మరో ముఖ్య నాయకుడి తల్లి, తమ్ముడు, ఆయన డ్రైవర్‌‌‌‌‌‌‌‌కు 1,700 గజాల భూమికట్టబెట్టారు. వీరితో పాటు క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది ఆరుగురి పేరున 300 గజాల చొప్పున రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అంతే కాకుండా సూర్యాపేటకు సంబంధం లేని ఓ వ్యక్తి 20 ఏండ్ల నుంచి సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌ 126లో ఉంటున్నట్లు ఫేక్‌‌‌‌‌‌‌‌ డాక్యుమెంట్లు సృష్టించి రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాడు. అయితే ఆ వ్యక్తికి ప్రస్తుతం 30 ఏళ్లు ఉండడం గమనార్హం. 

ఎంక్వైరీలో బయటపడ్డ అక్రమాలు 

కుడకుడ సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌ 126లో భూ ఆక్రమణలపై ఆరోపణలు రావడంతో రెవెన్యూ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు. ఇందుకోసం ఆర్డీవో, ముగ్గురు తహసీల్దార్లు, 10 మంది సర్వేయర్లు, రెవెన్యూ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లను నియమించారు. వీరు పది రోజుల పాటు ఎంక్వైరీ చేసి స్థలాన్ని అక్రమంగా రెగ్యులరైజేషన్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నట్లు నిర్ధారించారు. రెగ్యులరైజేషన్‌‌‌‌‌‌‌‌ కోసం పెట్టుకున్న అప్లికేషన్‌‌‌‌‌‌‌‌లో 2013 నుంచి ఇంటి పన్ను కడుతున్నట్లు బిల్లులు చూపించగా.. ఫేక్‌‌‌‌‌‌‌‌ బిల్‌‌‌‌‌‌‌‌ బుక్‌‌‌‌‌‌‌‌ తయారు చేసి ఫోర్జరీ సంతకాలతో బిల్లులు సృష్టించినట్లు ఆఫీసర్లు తేల్చారు. మరోవైపు ఇంటి పన్ను రశీదులో విలేజ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ కాకుండా సర్పంచ్‌‌‌‌‌‌‌‌ సంతకం చేసిన బిల్లు పెట్టారని, వీటితో పాటు ఇంటి నంబర్‌‌‌‌‌‌‌‌ లేకున్నా ఉన్నట్లు రికార్డులు సృష్టించారని, ఒకే ఇంటి ముందు యాంగిల్‌‌‌‌‌‌‌‌ మార్చి ఫొటోలు తీశారని, ఇండ్లు లేకున్నా ఉన్నట్లు ఫొటోలు మార్ఫింగ్‌‌‌‌‌‌‌‌ చేశారని 
ఆఫీసర్లు తేల్చారు. 

మూడు నెలలు దాటినా పట్టాలు క్యాన్సిల్‌‌ చేయట్లే...

ప్రభుత్వ భూమి కబ్జా, రెగ్యులరైజేషన్‌‌పై ఎంక్వైరీ చేపట్టిన ఆఫీసర్లు అన్ని డాక్యుమెంట్లు నకిలీవేనని నిర్ధారించారు. సర్వే నంబర్‌‌ 126లోని భూమిలో ఇండ్లే లేవని, ఇంటి పన్ను, కరెంట్‌‌ బిల్లులు అన్నీ నకిలీవేనని జూన్‌‌లో కలెక్టర్‌‌కు రిపోర్ట్‌‌ ఇచ్చారు. అయితే ఆఫీసర్లు రిపోర్ట్‌‌ ఇచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పట్టాలు క్యాన్సిల్‌‌ చేయకపోవడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టాలు ఎందుకు క్యాన్సిల్‌‌ చేయడం లేదని, అక్రమార్కులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని పలువురు డిమాండ్‌‌ చేస్తున్నారు.

ఫిర్యాదు చేసినా పట్టాలు క్యాన్సిల్‌‌ చేయలే ..

కుడకుడ 126 సర్వే నంబర్‌‌లో ప్రభుత్వ భూమి కబ్జాపై ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు పట్టాలు క్యాన్సిల్‌‌ చేయలేదు. కలెక్టర్‌‌ను అడిగితే వారం రోజుల్లో చర్యలు తీసుకుంటామని నెల రోజుల నుంచి చెబుతున్నారు. ఇప్పటికైనా స్పందించి అక్రమంగా పట్టా చేయించుకున్న వారితో పాటు చేసిన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి.
- సంకినేని వరుణ్‌‌రావు, బీజేపీ నాయకుడు