
- సర్కారు వైఫల్యంతో భూగర్భ జలాలు పడిపోతున్నయ్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కారు వైఫల్యంతో రాష్ట్రం నీటి సంక్షోభం దిశగా వెళ్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు తగ్గడమే అందుకు నిదర్శనమని శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. 2013 నుంచి 2023 వరకు భూగర్భజలాలు 56 శాతం పెరిగాయన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 27,000కు పైగా చెరువులను పునరుద్ధరించడంతో 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందన్నారు. కానీ 14 నెలల కాంగ్రెస్ పాలనలో ఈ వ్యవస్థ అస్తవ్యస్తమవుతున్నదన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు భారీగా పడిపోవడం ఆందోళనకరం.120 కిలోమీటర్ల పొడవున గోదావరి పూర్తిగా నీరులేకుండా ఎండిపోతున్నది. తాగునీటి కోసం ఎక్కువ మోటార్లు నడిపించుకోవాల్సి రావడం వల్ల కరెంట్ బిల్లులు పెరిగే పరిస్థితి. ప్రభుత్వం తక్షణమే స్పందించి నీటి పరిరక్షణ చర్యలు తీసుకోకపోతే మరింత నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.