
- ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపమైంది
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఏర్పాటు చేసిన 150 బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు (బీఏఎస్) ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థులు, స్కూల్ యాజమాన్యాలకు శాపంగా మారిందన్నారు. సరైన భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే, యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. అప్పుల భారం భరించలేక వనపర్తిలో ఒక పాఠశాల యజమాని ఆత్మహత్యాయత్యం చేసుకున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. విద్యకు అధిక ప్రాధాన్యమని చెబుతున్న మాట లు.. ఒట్టి నోటి మాటలేనని తేలిపోయిందన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో జోగిని వ్యవస్థ కు గురైనవారి పిల్లలు, రెక్కాడితేగాని డొక్కాడని కూలీల పిల్లలు 25 వేల మంది ఉన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు.