బంగారం లాంటి రాష్ట్రాన్ని అప్పజెప్తే సర్వనాశనం చేసిండు

బంగారం లాంటి రాష్ట్రాన్ని అప్పజెప్తే సర్వనాశనం చేసిండు
  • సీఎం రేవంత్​పై కేటీఆర్ ఫైర్​
  • ఆయనకు గాసిప్స్​ మీద తప్ప గవర్నెన్స్​ మీద దృష్టి లేదు
  • రాజకీయాల్లో హద్దు దాటొద్దనే  సంయమనం పాటించినం
  • రాష్ట్రం అప్పుల పాలైతే.. అందాల పోటీలు ఎందుకు?
  • ఎంఐఎంకు మేమంటే ఏమిటో చూపిస్తం
  • మీడియాతో చిట్​చాట్​లో వ్యాఖ్యలు
  • బీఆర్​ఎస్​ వాళ్లు ఏం చేస్తరో చూస్తమంటూ అక్బర్​ కౌంటర్​

హైదరాబాద్​, వెలుగు: బంగారం లాంటి రాష్ట్రాన్ని అప్పజెప్తే సీఎం రేవంత్ ​రెడ్డి సర్వనాశనం చేశారని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ విమర్శించారు. ఎలాంటి ఆర్థికమాంద్యం లేకుండానే.. కరోనా​వంటి సంక్షోభం లేకుం డానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. రాష్ట్ర ప్రజలు విచక్షణతో ఆలోచించి రెండుసార్లు తమకు అవకాశం ఇచ్చారు కాబట్టే తెలంగాణ బలంగా నిలబడిందని అన్నారు. 

సీఎంకు ​గాసిప్స్ మీద తప్ప గవర్నెన్స్​ మీద దృష్టి పెట్టలేదని దుయ్యబట్టారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో కేటీఆర్ చిట్​చాట్ చేశారు. ‘‘తెలంగాణకు నాయకత్వ లక్ష ణాలు లేవు, పాలన చేతకాదన్న సమైక్యాంధ్ర పాలకుల మాటలు రేవంత్​ పాలనతో నిజమవుతున్నాయి. 

రాష్ట్ర ఆదాయం రూ.70 వేల కోట్లు తగ్గిందని రేవంత్​ ఒప్పుకున్నడు. తెలంగాణ రైజింగ్​ అంటూనే ఈ తగ్గింపు ఏమిటి? ఇది ముమ్మాటికీ తెలంగాణ ఫాలింగ్. ప్రభుత్వం అట్టర్​ఫ్లాప్ అని సీఎం స్వయంగా ఒప్పుకున్నడు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడానికి ఆయన విధానాలే కారణం. ఏడాదిగా రేవంత్​ చేసిందంతా నెగెటివ్​ పాలిటిక్సే” అని ఆయన విమర్శలు గుప్పించారు.

 ఫస్టియర్​ పరీక్షలో సీఎం రేవంత్​ దారుణంగా ఫెయిల్​ అయ్యారని వ్యాఖ్యానించారు. ‘‘భూములు అమ్మొ ద్దంటూ హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా చేస్తున్నరు. గతంలో యూనివ ర్సిటీకి వచ్చి పోజులు కొట్టిన రాహుల్​ గాంధీ ఇప్పు డెందుకు వస్తలేడు? రాష్ట్రం అప్పులపాలైందని చెప్పి అందాల పోటీలు ఎందుకు పెడుతున్నరు?” అని కేటీఆర్​ ప్రశ్నించారు. అందాల పోటీ లు పెట్టి ఊరూరికీ ఓ బ్యూటీ పార్లర్​ ఏమైనా పెడ్తరా? అని వ్యాఖ్యానించారు. 

విలువలు ఇప్పుడు గుర్తొచ్చినయా?

రేవంత్​కు ప్రజాస్వామ్య విలువలు, కుటుంబం ఇప్పుడు గుర్తొచ్చాయా? అని కేటీఆర్​ ప్రశ్నించారు. ‘‘నా మీద 15 కేసులు పెట్టినప్పుడు, నాపై అసభ్యకర ఆరోపణలు చేసినప్పుడు, మమ్మల్ని బూతులు తిట్టినప్పుడు.. మా కుటుం బాలు గుర్తుకురాలేదా?  మాకు సంబంధాలు అంటగట్టినప్పుడు, మా పిల్లల్ని రాజకీయాల్లో కి లాగిన రోజు విలువలు గుర్తుకురాలేదా? ఇప్పుడు సీఎం తన భార్యాపిల్లల గురించి మాట్లాడుతున్నడు. మరి, ఆ రోజు మాకు కూడా కుటుంబాలు ఉండేవన్న విషయం రేవంత్​కు తెలియదా?” అని ఆయన వ్యాఖ్యానించారు. 

తాము కూడా రేవంత్ లాగా మాట్లాడితే ఆయ న బయట తిరగలేరని, తాము కూడా రేవంత్​ బట్టలు విప్పగలమని మండిపడ్డారు. రేవంత్​ దాటిన రేఖలు, తారలు, వాణిల గురించి మాట్లాడగలమని, ఆ విషయాలు చెప్తే రేవంత్​కు ఇంట్లో అన్నం కూడా పెట్టరని కేటీఆర్​ అన్నా రు. తాము కూడా సాగర్​ సొసైటీ, మైహోం భుజా వ్యవహారాలను బయటపెట్టగలమని పేర్కొన్నారు. రేవంత్​ సెల్ఫ్​ డ్రైవింగ్​ కథలు, ప్రైవేట్ కార్ల వివరాలను చెప్తామన్నారు. ఎక్కు వ మాట్లాడితే ఫొటోలు కూడా బయటపెడతామని కేటీఆర్​ హెచ్చరించారు. రాజకీయాల్లో హద్దు దాటొద్దని ఇన్నాళ్లూ సంయమనంతో వ్యవహరించామని తెలిపారు. 

ఎంఐఎం విషయంలో తప్పు చేసినం

ఎంఐఎం విషయంలో తాము తప్పు చేశామని కేటీఆర్ అన్నారు. అలగడం.. ఏదో ఒక పని చేయించుకోవడం అక్బరుద్దీన్ నైజమన్నారు. ‘‘ఈసారి మేం అధికారంలోకి వచ్చాక.. ఎంఐ ఎం వాళ్లకు మేమేంటో చూపిస్తం. అసెంబ్లీలో ఎంఐఎం సంఖ్యా బలమెంత.. అక్బరుద్దీన్ మాట్లాడేందుకు ఇస్తున్న సమయమెంత?” అని కేటీఆర్​ అన్నారు. అంతకుముందు బీసీ బిల్లు చట్టబద్ధతతకు ఢిల్లీ వేదికగా తాము చేపట్టబోయే ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న.. కేటీఆర్​ను కలిసి కోరారు.  

తేల్చుకుంటం: అక్బరుద్దీన్​

కేటీఆర్​ వ్యాఖ్యలకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరు ద్దీన్​ కౌంటర్​ ఇచ్చారు. బీఆర్​ఎస్​ వాళ్లు ఏం చేస్తరో చూస్తామని, తప్పకుండా తేల్చుకుంటామని మీడియా ప్రశ్నకు బదులిచ్చారు.