![Liquor case update: కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు](https://static.v6velugu.com/uploads/2024/07/brs-mlc-bail-petition-rejected-by-delhi-high-court_ZEPtDHkuys.jpg)
ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఈడీ, సీబీఐ కేసులో అరెస్టై.. తీహార్ జైల్లో ఉన్న కవిత ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిగింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సీబీఐ కేసుల్లో మే 6న కవిత బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంటూ బెయిల్ నిరాకరించింది.
మార్చి 16న లిక్కర్ పాలసీ ఈడీ కేసులో, ఏప్రిల్ 11న సీబీఐ కేసులో కవిత అరెస్టయిన సంగతి తెలిసిందే.కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. పీఎంఎల్ఏ సెక్షన్-19 ప్రకారం.. కవిత అరెస్ట్ చట్ట విరుద్ధమని, ఆమె రూ.100 కోట్లు చెల్లించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని ఆమె తరపు న్యాయవాది కోర్టులో గట్టిగా వాదించారు. ఈ మేరకు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ, సీబీఐలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ .. సీబీఐ వాదనలతో ఏకీభవించిన ఢిల్లీ హైకోర్టు కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.