
తూప్రాన్, వెలుగు: మెదక్ గడ్డ అంటేనే బీఆర్ఎస్అడ్డా అని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆదివారం తూప్రాన్ లో జరిగిన ఉమ్మడి మండల కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి లో 50 ఏళ్లు ముందుకు పోయిందన్నారు. తనకు మాయ మాటలు రావని, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
కలెక్టర్ గా ఖ్యాతి ఇచ్చిన మెదక్ గడ్డే రాజకీయ జీవితం ఇవ్వాలన్నారు. తనకు డబ్బు మీద ఆశ లేదని, పేదలకు సేవచేయడానికి రాజకీయాలకు వచ్చానన్నారు. రూ.100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేసి యువతకు కోచింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రతీ ఒక్క కార్యకర్తను ఆదుకుంటామని కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
అంతక ముందు అంబేద్కర్ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ హేమలత, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ప్రతాప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, జడ్పీటీసీ రాణి, నాయకులు రవి, శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, సతీశ్ చారి, శ్రీనివాస్, ఆంజనేయులుగౌడ్, చంద్రారెడ్డి, కిష్టారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, చక్రవర్తి పాల్గొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెబుతారు
గజ్వేల్: జూటా మాటలు చెబుతున్న కాంగ్రెస్, బీజేపీకిఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వెంకట్రామిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం, జగదేవ్పూర్ గ్రామాల్లో వర్గల్, ములుగు, జగదేవ్పూర్, మర్కూక్ మండలాల కార్యకర్తల సమావేశాల్లో మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో వంద అబద్ధాలు ఆడిన రఘునందన్ రావును ఎంపీ ఎన్నికల్లో ఓటు ద్వారా పాతరేయాలన్నారు.