ఖమ్మం కారులో వర్గపోరు.. కేసీఆర్​ బర్త్​డే నాడైనా కలవని నేతలు

ఖమ్మం కారులో వర్గపోరు.. కేసీఆర్​ బర్త్​డే నాడైనా కలవని నేతలు
  • పార్టీ జిల్లా ఆఫీసు, మమత కాలేజీలో సెపరేట్ గా సంబురాలు 
  • త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు, అయినా కలవని మనసులు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా కారు పార్టీలో ఎవరికి వారే అన్నట్టుగా వర్గాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయి 15 నెలలు అవుతున్నా,  ఆ పార్టీ లీడర్ల తీరు మారలేదు. ఇప్పటికీ  వేర్వేరుగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమవారం  కేసీఆర్​ పుట్టిన రోజు వేడుకలు కూడా నేతలను కలపలేకపోయాయి.  జిల్లా పార్టీ కార్యాలయంలో  జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్​ ఆధ్వర్యంలో కేసీఆర్​ బర్త్ డే జరిపారు. ఈ ప్రోగ్రామ్​ లో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, కొందరు కార్పొరేటర్లు పాల్గొని కేక్​ కట్ చేశారు. 

ఖమ్మం నగరంలోనే ఉన్నా ఈ ప్రోగ్రామ్​ కు మాజీ మంత్రి పువ్వాడ అజయ్​ దూరంగా ఉన్నారు. ఆయన మమత కాలేజీ ఆవరణలో ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. కేక్​ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్​ కూరాకుల నాగభూషణం, మాజీ మార్కెట్ చైర్మన్ఆర్జేసీ కృష్ణ, నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మరికొందరు కార్పొరేటర్లు పాల్గొన్నారు. బీఆర్ఎస్​ పార్టీ ఆఫీస్​ లో సంబురాలు, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న కొందరు కార్పొరేటర్లు, లోకల్ నేతలు తర్వాత హుటాహుటిన మమత క్యాంపస్​ లో జరిగిన ప్రోగ్రామ్​ కు పరుగులు తీశారు. ఏ ప్రోగ్రామ్​ కు వెళ్లకుంటే ఎవరు హర్ట్ అవుతారోనని టెన్షన్​ పడ్డారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచే  ఖమ్మం జిల్లా పార్టీలో వర్గ పోరు  కొనసాగుతోంది. . నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ కార్యక్రమాలు సహా పలు సందర్భాల్లో ఈ విషయం బయటపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కూడా వర్గాలు కొనసాగాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ ఈ వర్గ విభేదాలు బయటపడ్డాయి. ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఏకతాటిపై లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల కంటే ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్​ ఓట్ల శాతాన్ని గణనీయంగా కోల్పోయింది. 

ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులకు 2.65 లక్షల ఓట్ల లీడ్​ వచ్చింది. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 4.67 లక్షల మెజార్టీ కాంగ్రెస్​ కు వచ్చింది. దీంతో ఆర్నెళ్లలోనే 2 లక్షల ఓట్లను బీఆర్ఎస్​ కోల్పోయింది. అయినా పార్టీలోని ముఖ్య నేతల తీరు మారలేదు. 

గత 15 నెలల్లో చాలా మంది తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎక్కువ రోజులు హైదరాబాద్​ కే పరిమితం కావడంతో జిల్లాలో పార్టీ కార్యకర్తలు నీరసపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్​, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాత్రమే తరచుగా జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. 

పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్​ రెడ్డి మూడు, నాలుగుసార్లు మాత్రమే జిల్లాకు వచ్చారు. మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు కూడా హైదరాబాద్​ లో ఉంటూ ఖమ్మంలో ప్రైవేట్ కార్యక్రమాలకు మాత్రమే అప్పుడప్పుడు హాజరవుతున్నారు. ఒకవైపు టీచర్​ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. 

రెండు మూడు నెలల్లోనే ఎలక్షన్లు జరిగే అవకాశముంది. కానీ బీఆర్ఎస్​ పార్టీలో మాత్రం నేతల మధ్య సఖ్యత లేకపోవడం ఆ పార్టీకే నష్టదాయకంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్గాలుగా మారి, వేర్వేరుగా కార్యక్రమాలు చేయడం వల్ల పార్టీ జనంలో మరింత పలచబడిపోతుందని ఆ పార్టీ నేతలే కామెంట్స్​ చేస్తున్నారు.