
హనుమకొండ, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో సాంస్కృతిక సారథి కళాకారుల ఆటాపాట వివాదానికి దారి తీసింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచే జనాలు సభా ప్రాంగణానికి చేరుకోగా.. ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతున్న తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కొందరు పార్టీ ప్రోగ్రాంలో పాల్గొనడంతో పాటు సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి వచ్చే వరకు పాటలు, ప్రసంగాలతో సందడి చేశారు.
కొందరు గులాబీ కండువాలు వేసుకుని పాటలు పాడుతూ స్టెప్పులేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పార్టీ కార్యక్రమాలకు సాంస్కృతిక సారథి కళాకారులను ప్రచారానికి వాడుకోవడంపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సభల్లో సాంస్కృతిక సారథి కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.