
బషీర్బాగ్, వెలుగు: బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇచ్చేలా ఆ పార్టీ వరంగల్ రజతోత్సవ సభలో ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్చేశారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు. సభలో బీసీ రాజకీయ పాలసీ ప్రకటించాలని ఆయన కోరారు. శుక్రవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ జెండాలు 25 ఏండ్లు మోసింది ఎస్సీ, ఎస్టీ, బీసీ లేనని కానీ పదవులు అనుభవించింది మాత్రం ఆ నలుగురేనని తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ ఈ 16 నెలల కాలంలో ఎక్కడ ఉన్నారని, ప్రజాసమస్యలను ఎందుకు పట్టించుకోలేదని విమర్శించారు. అలాంటి వారి సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీనా, ప్రాంతీయ పార్టీనా కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులను తీవ్రంగా అవమానించింది బీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించారు. ఈ సమావేశంలో పలు బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.