కాంగ్రెస్​లోకి భారీ వలసలు

కాంగ్రెస్​లోకి భారీ వలసలు
  • బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరుతున్న ప్రజాప్రతినిధులు
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న సెగ్మెంట్లలలో సైతం ఇదే పరిస్థితి

మెదక్, వెలుగు:  గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ఓడిపోయి కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీకోసం ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ తగిన గుర్తింపు గౌరవం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అవకాశం, నామినేటెడ్​ పోస్టుల్లో ఛాన్స్​లభించలేదని అసంతృప్తితో ఉన్న కొందరు నాయకులు అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీని వీడి కాంగ్రెస్ లో​ చేరారు.

మరి కొందరు నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్​కు గుడ్​బై చెబుతున్నారు. బీఆర్ఎస్​అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గాల్లో సైతం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పార్టీని వీడుతున్నారు.  అభివృద్ధి పనులకు ఫండ్స్​ శాంక్షన్​ కావాలన్నా, పనులు జరగాలన్నా, ఏదైనా ఇబ్బంది కలిగితే సమస్య పరిష్కారం కావాలన్నాఅధికార పార్టీలో ఉంటేనే సాధ్యమవుతుందన్న అభిప్రాయం ప్రజాప్రతినిధులు, నాయకుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలో ఉంది కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించి కొందరు నాయకులు బీఆర్ఎస్​ నుంచి బయటకు వస్తున్నారు.  

గజ్వేల్ సెగ్మెంట్​నుంచే షురూ..

జిల్లాలో పార్టీ ఫిరాయింపులు మాజీ సీఎం కేసీఆర్​ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్​నియోజకవర్గం నుంచే మొదలయ్యాయి. ముందుగా రాష్ట్ర సర్పంచ్​ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్, మనోహరాబాద్​ సర్పంచ్​ మహిపాల్ రెడ్డి  కాంగ్రెస్​లో చేరారు. ఆ తర్వాత  తూప్రాన్​ మున్సిపల్​ చైర్మన్​బొంది రవీందర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వైస్​ చైర్మన్​నందాల శ్రీనివాస్ తోపాటు మరో ఏడుగురు బీఆర్ఎస్​ కౌన్సిలర్లు ఆ పార్టీకి  గుడ్​బై చెప్పి ఇటీవల సీఎం రేవంత్​రెడ్డిని కలిసి, మంత్రి పొన్నం ప్రభాకర్​ సమక్షంలో కాంగ్రెస్​లో జాయిన్ అయ్యారు. ​ 

చేగుంట ఎంపీపీ సైతం..

దుబ్బాక నియోజకవర్గంలో సైతం బీఆర్ఎస్​నుంచి కాంగ్రెస్​లోకి వలసలు షురూ అయ్యాయి. దుబ్బాక ఎమ్మెల్యేగా బీఆర్ఎస్​అభ్యర్థి కొత్త ప్రభాకర్​రెడ్డి గెలుపొందినప్పటికీ బీఆర్ఎస్​ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పార్టీ వీడుతున్నారు. మూడు రోజుల కిందట చేగుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్​ కుమార్,  మండల కోఆప్షన్ మెంబర్  మహ్మద్ అలీ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తాజాగా శనివారం చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ బీఆర్ఎస్ కు రాం రాం చెప్పారు. వీరు త్వరలోనే కాంగ్రెస్​లో చేరేందుకు సన్నద్ధం అవుతున్నారు. 

మెదక్​లోనూ..

అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్​ఓడిపోవడంతో ఆ పార్టీకి చెందిన మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు కొందరు బీఆర్ఎస్ ను వీడుతారనే ప్రచారం జరుగుతోంది. గత మున్సిపల్​ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీచేసి కౌన్సిలర్లుగా గెలిచిన వారు కొన్నాళ్ల తర్వాత బీఆర్ఎస్ లోజాయిన్​అయ్యారు. ఇపుడు వారు ఘర్​వాపసీ అయ్యేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.

 వారితోపాటు బీఆర్ఎస్​ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న మరికొందరు కౌన్సిలర్లు సైతం కాంగ్రెస్​లో చేరాలనుకుంటున్నట్టు సమాచారం. కాగా ఇతర పార్టీల నుంచి వచ్చే వారి విషయంలో కాంగ్రెస్​ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇదివరకు కాంగ్రెస్​లో పనిచేసి ఎన్నికల ముందు బీఆర్ఎస్​లోకి వెళ్లిన కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు మళ్లీ కాంగ్రెస్​లోకి రావాలనుకుంటుండగా.. అవకాశవాద రాజకీయాలు చేసే అలాంటి వారికి నో చెబుతున్నట్టు తెలిసింది.