- గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లనూ ట్యాప్ చేయించిన గత సర్కార్
- వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్లు కూడా..
- కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు ఫోన్ ట్యాప్
- సందీప్ రావు, ఆయన స్నేహితుడి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్
- 16 మంది హైకోర్టు జడ్జిల వ్యక్తిగత సమాచారంతో ప్రొఫైల్స్
- వీరి ఫోన్లనూ ట్యాపింగ్ చేశారా.. అనే కోణంలో సిట్ ఎంక్వైరీ
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేసి వారిని గ్రిప్లో పెట్టుకునేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ వ్యూహం పన్నినట్టు తేలింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సహా వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా వదలకుండా ట్యాపింగ్కు పాల్పడినట్టు బయటపడింది. ఇందులో కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ సభ్యులను టార్గెట్ చేసినట్టు తెలిసింది. గత ఎన్నికల సమయంలో మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్రావు, ఆయన స్నేహితుడు, బిజినెస్ పార్ట్నర్ ఫోన్ నంబర్ను కూడా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు టీమ్ ట్యాప్ చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సందీప్రావుతో పాటు మరొకరి స్టేట్మెంట్ను సిట్అధికారులు గురువారం రికార్డ్ చేశారు. 2023 నవంబర్15 నుంచి 30వ తేదీ వరకు 415 ఫోన్ నంబర్స్ ట్యాప్ చేసినట్టు గుర్తించారు. వీటిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు సహా మండలస్థాయి లీడర్ల ఫోన్లను ప్రణీత్రావు టీమ్ ట్యాప్ చేసింది. ఫోరెన్సిక్ల్యాబ్ రిపోర్ట్ మేరకు ట్యాపింగ్జరిగిన ఫోన్ నంబర్లకు సిట్అధికారులు కాల్ చేసి వారిని పిలిపించి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. ట్యాపింగ్ లిస్ట్లో ఉన్న నంబర్స్కు సిట్అధికారులు ఫోన్ చేయగా.. ‘‘నా ఫోన్ ట్యాప్ అయ్యిందా? ఎప్పుడు సర్? ఎప్పటి నుంచి ట్యాప్ చేశారు?’’ అంటూ ఆశ్చర్యానికి గురవుతున్నట్టు తెలిసింది.
జడ్జిల ప్రొఫైల్స్ క్రియేట్..
ఓ హైకోర్టు జడ్జితో పాటు ఆయన భార్య ఫోన్ నంబర్ను ప్రణీత్ రావు టీమ్ ట్యాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరి ఫోన్ నంబర్స్ ట్యాప్ చేయడానికి గల కారణాలపై ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఎస్ఐబీ స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్(ఎస్ఓటీ) నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్డిస్క్, నిందితుల ఫోన్ల ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా మరో 16 మంది హైకోర్టు జడ్జీల ప్రొఫైల్స్ను కూడా ప్రణీత్ రావు టీమ్ క్రియేట్ చేసినట్టు సిట్ గుర్తించింది. వీరిలో ఓ మహిళా జడ్జికి సంబంధించిన ప్రొఫైల్ కూడా తయారు చేయడానికి గత కారణాలను సేకరిస్తున్నారు. ప్రొఫైల్స్ మాత్రమే క్రియేట్ చేశారా? లేక వారి ఫోన్ నంబర్స్ కూడా ట్యాప్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
పబ్లిక్ డొమైన్ నుంచి జడ్జిల డేటా సేకరణ!
ఈ కేసులో 3వ నిందితుడైన మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ పొలిటికల్ వింగ్ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించాడు. సమాచార సేకరణలో భాగంగా పాలక, ప్రతిపక్ష పార్టీలు, ప్రముఖులు సహా వారికి సంబంధించిన పూర్తి వివరాలతో డేటా రూపొందించాడు. ఈ క్రమంలోనే పబ్లిక్ డొమైన్లో ఉన్న హైకోర్టు జడ్జీల వివరాలను ఆన్లైన్లో సేకరించినట్టు అనుమానిస్తున్నారు. హైకోర్టు జడ్జీల ప్రొఫైల్స్ను క్రియేట్ చేయడం ద్వారా న్యాయ వ్యవస్థను కూడా టార్గెట్ చేసినట్టు సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది. సాధారణంగా ఎస్ఐబీ విధుల్లో భాగంగా హై ప్రొఫైల్ వీఐపీలు, రాజకీయ ప్రముఖులు, సామాజిక వేత్తలు, పౌరహక్కుల సంఘాల నేతలకు సంబంధించిన పూర్తివివరాలతో ప్రొఫైల్ తయారు చేస్తుంటారు. కానీ, జడ్జీల వ్యక్తిగత సమాచారం సేకరించడంపై ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చంచల్గూడ జైలు నుంచి రాధాకిషన్ రావు రిలీజ్..
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు సిటీ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు శుక్రవారం చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అలాగే, ఇప్పటికే మధ్యంతర బెయిల్పై ఉన్న భుజంగరావుకు రెగ్యులర్ బెయిల్ కూడా లభించింది. అలాగే, శ్రవణ్రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై కూడా హైకోర్టు తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు సిట్ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల నాంపల్లి కోర్టులో ప్రొక్లమేషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈ నెల 6న విచారణ జరగనుంది. ప్రొక్లమేషన్ జారీ అయితే పాస్పోర్టులు రద్దయ్యే అవకాశం ఉంటుంది. కాగా, ఫోన్ ట్యాప్ చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని మాజీ డీసీసీ రాధాకిషన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పాత కేసులో హైకోర్టు బెయిలు మంజూరు చేసిందని.. ఈ నేపథ్యంలో కుట్ర పూరిత ఫిర్యాదును కొట్టేయాలని రాధాకిషన్ రావు కోరారు.