తెలంగాణలో కాంగ్రెసోళ్లు పెద్ద మార్పే తెచ్చారు: కేటీఆర్

 తెలంగాణలో  కాంగ్రెసోళ్లు పెద్ద మార్పే తెచ్చారు: కేటీఆర్

 కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పాలనపై ట్వీట్ చేసిన కేటీఆర్..మార్పు కావాలి  కాంగ్రెస్ రావాలి అని.. మొత్తానికి.. కాంగ్రెసోళ్లు వచ్చి పెద్ద మార్పే తెచ్చారని సెటైర్ వేశారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో.. ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి పురుగుల అన్నం, నీళ్ల చారు పెడితే ఈ నాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో  బల్లిపడిన టిఫిన్లు  , చిట్టెలుకలు తిరిగే చట్నీలు పెడుతున్నారంటూ ట్వీట్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని కోరారు. 

నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లి పడి..20 మంది విద్యార్థులకు వాంతులు. సుల్తాన్ పూర్ జేఎన్టీయూ హాస్టల్ లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలు. ఈ విషాహారం తింటే.. విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు ??అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడ ???. కలుషిత ఆహారం వల్ల...పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రుల పాలవుతున్నారు.అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే..విద్యార్థులకు ఈ అవస్థ...! ఈ అస్వస్థత...!! ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలి..లేకపోతే.. భావిభారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదం వైఫల్యాలను సరిచేయకపోతే ఊహించని విషాదం అంటూ పోస్ట్ చేశారు కేటీఆర్.