గ్రామీణ భూములకు యూనిక్​ నంబర్లు

గ్రామీణ భూములకు యూనిక్​ నంబర్లు
  • పట్టణాల్లోని అన్ని భూ రికార్డుల డిజిటైజేషన్
  • మూడేండ్లలో రాష్ట్రాలు పూర్తి చేయాలి
  • వేగంగా అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు  

న్యూఢిల్లీ:  దేశంలో భూ సంస్కరణలు తీసుకురావాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లు కేటాయించాలని, పట్టణ ప్రాంతాల్లోని అన్ని భూ రికార్డులను డిజిటైజేషన్ చేయాలని పేర్కొన్నారు. ఈ రెండు భూ సంస్కరణలను సంబంధి త రాష్ట్ర ప్రభుత్వాలే చేపట్టాలన్నారు. వచ్చే మూడేండ్లలో ఈ సంస్కరణలను పూర్తిచేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా ఆర్థిక సాయం అందించనున్నట్టు ఆమె ప్రకటించారు.

 ‘‘భూ సంస్కరణలకు సంబంధించి గ్రామాల్లో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ప్లానింగ్, మేనేజ్ మెంట్.. పట్టణాల్లో ప్లానింగ్, వినియోగం, బిల్డింగ్ బైలాస్” వంటివి చేపట్టాల్సి ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని భూములకు యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నంబర్లు కేటాయించాలి. సర్వే చేసి ప్రస్తుత ఓనర్షిప్ ప్రకారం మ్యాపులను డిజిటైజ్ చేయాలి. ల్యాండ్ రిజిస్ట్రీని ఏర్పాటు చేసి దానిని ఫార్మర్స్ రిజిస్ట్రీకి లింక్ చేయాలి” అని నిర్మల వివరించారు. పట్టణాల్లోని భూములను డిజిటైజ్ చేసి, జీఐఎస్ మ్యాపింగ్ చేయాలన్నారు. సంస్కరణలను వేగంగా అమలు చేసే రాష్ట్రాలకు 50 ఏండ్ల కాలపరిమితితో వడ్డీ రహిత రుణాన్ని ఇస్తామన్నారు.