హైదరాబాద్ బిల్డర్ మధు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాసినో ఆడుదామని తీసుకుని వెళ్లి మధుని దారుణ హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మధు.. చీకోటి రామ్ అనుచరుడు. ఆయన హైదరాబాద్ నగరంలో బిల్డర్ బిజినెస్ చేస్తున్నారు. మధుకు 200 కోట్ల ఆస్తి ఉంది. మధుకు ఇద్దరు ఆడపిల్లలు. ఆయనకు క్యాసినో వ్యసనం ఉంది.
ఆటలో మధుకు నిందితుడు రేణుకా ప్రసాద్ గ్యాంగ్తో స్నేహం ఏర్పడింది. మధు నవరాత్రులు ఘనంగా నిర్వహించే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే తన పూజ అప్పుడు తన మిత్రుడు రేణుకా ప్రసాద్ ను ఆహ్వానించాడు. పూజలో మధు చిన్న కూతురు పాల్గొంది. అదే టైంలో మధు చిన్న కూతురుపై రేణుకా ప్రసాద్ కన్నేశాడు.. ప్రేమలోకి దింపాడు. తమ ప్రేమ విషయం మధుకు చెప్పి...కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమని రేణుకా ప్రసాద్ కోరాడు.
అందుకు మధు ఒప్పుకోలేదు. ఈమధ్యే చిన్నకూతురికి వేరే పెళ్లి సంబంధం కుదిర్చాడు. దీంతో రేణుకా ప్రసాద్ మధుపై కక్ష పెంచుకున్నాడు. ప్రేమను దూరం చేసిన మధును చంపడానికి స్కెచ్ వేశాడు. ముందుగా హైదరాబాద్లోనే హత్యకు ప్రణాళిక వేశాడు. సుపారీ గ్యాంగ్ను నెలరోజులు హైదరాబాద్లో ఉంచాడు.
హైదరాబాద్లో హత్యకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. క్యాసినో ఆడుదామని బీదర్కు తీసుకెళ్లి రేణుకా ప్రసాద్ మధును దారుణంగా హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యతో మధు కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు కమ్ముకున్నాయి.