
- ఒకరి ఫిర్యాదుతో పోలీసుల విచారణ
- నిద్ర మాత్రలిచ్చి చంపామన్న నిందితులు
- ఫోరెన్సిక్ ల్యాబ్కు బాడీ పార్ట్స్
- మెదక్ జిల్లాలో దారుణం
మెదక్ (చేగుంట), వెలుగు : మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్లో ఏడాదిన్నర కింద ఓ వ్యక్తిని చంపేసిన కుటుంబీకులు సాధారణ మరణం అని నమ్మించి ఖననం చేశారు. అయితే, గుర్తు తెలియని ఓ వ్యక్తి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సమాధిని తవ్వి బాడీ పార్ట్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. మరో వైపు కుటుంబసభ్యులను విచారించగా పొలం కోసం తామే చంపామని అంగీకరించారు. అయితే, ఈ విషయాలను పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... అనంతసాగర్ గ్రామానికి చెందిన కావేటి కిష్టయ్య (65) ఏడాదిన్నర కింద చనిపోయాడు. కుటుంబసభ్యులు అతడిది సాధారణ మరణమేనని నమ్మించి ఖననం చేశారు. ఇటీవల ఓ వ్యక్తి కిష్టయ్య మామూలుగా చనిపోలేదని, అతన్ని కుటుంబసభ్యులే పథకం ప్రకారం చంపేసి, సాధారణ మరణంగా నమ్మించారని పోలీసు ఉన్నతాధికారికి సమాచారం ఇచ్చాడు. దీంతో చేగుంట పోలీసులు చనిపోయిన కిష్టయ్య కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకుని విచారించగా, తామే కిష్టయ్యను మర్డర్ చేసి సాధారణ మరణంగా చిత్రీకరించామని అంగీకరించారు. దీంతో సోమవారం సికింద్రాబాద్ గాంధీ దవాఖాన నుంచి డాక్టర్లను అనంతసాగర్రప్పించి కిష్టయ్యను ఖననం చేసిన చోట తవ్వి ఎముకలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. కిష్టయ్య పేరుమీద మూడెకరాల భూమి ఉండగా, దానిని తమ పేరు మీద చేయాలని ఒత్తిడి తేగా అందుకు అంగీకరించకపోవడంతో నిద్రమాత్రలు ఇచ్చి చంపేసినట్టు నిందితులు వెల్లడించినట్టు తెలిసింది.
చెల్లిని పెండ్లి చేసుకున్నాడని వరుడి అన్న హత్య
మెదక్ : తన సోదరిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడనే కోపంతో అతడి అన్నను కత్తితో పొడిచి చంపాడో వ్యక్తి. జిల్లా కేంద్రమైన మెదక్లో సోమవారం రాత్రి ఈ హత్య జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..నవాపేట వీధికి చెందిన పోతరాజు నగేశ్(25)తమ్ముడు ఉదయ్ పాల్, బొందుగుల అంజిత్కుమార్ సోదరి భవాని ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ పెద్దలు పెండ్లికి అంగీకరించలేదు. దీంతో ఆదివారం హైదరాబాద్లో పెండ్లి చేసుకున్నారు. విషయం తెలిసి అంజిత్ కుమార్ ఆగ్రహంతో ఊగిపోయాడు. సోమవారం ఉదయ్పాల్ ఇంటికి వెళ్లి అతడి కుటుంబసభ్యులతో గొడవ పడ్డాడు. కత్తితో దాడి చేయడంతో ఉదయ్పాల్ అన్న నగేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు. దాడిని అడ్డుకోబోయిన నగేశ్ తండ్రి యాదగిరి, వరుసకు సోదరుడయ్యే పోతరాజు సాయికుమార్ గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.