
- దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ముషీరాబాద్, వెలుగు : అప్పుడే పుట్టిన ఆడ శిశువును మంటల్లో కాల్చి సజీవ దహనం చేసిన విషాదకర ఘటన దోమలగూడ పోలీస్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్ రెడ్డి వివరాల ప్రకారం.. ఇందిరా పార్క్ ఎన్టీఆర్ స్టేడియం లో చెత్త తరలించే వాహనాల పక్కన అప్పుడే పుట్టిన ఆడ శిశువుకు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. మంటల్లో కాలి శిశువు మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే క్లూస్ టీంతో రంగంలోకి దిగారు.
దోమలగూడ ఏసీపీ రాఘవేంద్ర, సీఐ శ్రీనివాస్ రెడ్డి సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్నిపరిశీలించారు. శిశువు తల్లి తండ్రులు ఎవరో , ఈ ఘటనకు పాల్పడిన దుండగులకై గాలింపు చర్యలు మమ్మురం చేశామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.