హైవేపై బైకర్ నిర్లక్ష్యం.. వాళ్ల ప్రాణాలను కాపాడబోయి.. రాంగ్ రూట్‎లో బోల్తాపడిన బస్సు

హైవేపై బైకర్ నిర్లక్ష్యం.. వాళ్ల ప్రాణాలను కాపాడబోయి.. రాంగ్ రూట్‎లో బోల్తాపడిన బస్సు

ముంబై: మహారాష్ట్ర లాతుర్‎లో సినీ రేంజ్‎లో ప్రమాదం జరిగింది. హైవేపై బైకర్ నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులోని 15 నుంచి 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సీన్ మొత్తం హైవేపై ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బైకర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. హైవేపై నిర్లక్ష్యంగా బండి నడిపి బస్ ప్రమాదానికి కారణమైన బైకర్‎పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నెటిజన్లు. 

ALSO READ | మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

మంగళవారం (మార్చి 4) లాతుర్ హైవేపై ఓ బస్ ప్రయాణికులతో వెళ్తుంది. ఇదే రోడ్డుపై వెళ్తున్న ఓ బైకర్ వెనక నుంచి వస్తోన్న బస్సును గమనించకుండానే యూ టర్న్ తీసుకునేందుకు ఒక్కసారిగా రోడ్డు మధ్యలోకి వచ్చాడు. ఈ క్రమంలో ముందున్న  బైక్‎ను తప్పించబోయి డ్రైవర్ బస్సును ఓవర్ టర్న్ చేశాడు. డ్రైవర్ బస్‎పై నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పిన బస్.. రాంగ్ రూట్లోకి వెళ్లి బోల్తా పడింది. 

ఈ ఘటనలో బస్‎లోని 15 నుంచి 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు.. నిర్లక్ష్యంగా బైక్ నడిపి ప్రమాదానికి కారణమైన బైకర్‎పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.