
పెనుబల్లి, వెలుగు: హైవే పక్కన ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ కండక్టర్ చనిపోగా, పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్ విశాఖపట్నం నుంచి ఖమ్మం వెళ్తోంది. కల్లూరుకు చెందిన, సత్తుపల్లి డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న సీతారామప్రసాద్ (50) డ్యూటీ దిగి స్వగ్రామం వెళ్లేందుకు ఇదే బస్సు ఎక్కాడు.
బస్సు ఖమ్మం – దేవరలంక హైవేపై కొత్తలంకపల్లి గ్రామం వద్దకు రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో బస్లో డ్రైవర్ పక్కన కూర్చున్న సీతారామప్రసాద్కు తీవ్రగాయాలు కాగా, 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు గాయపడిన వారిని పెనుబల్లి ఏరియా హాస్పిటల్కు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ సీతారామప్రసాద్ చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వీఎం బంజరు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.
ఆటో బోల్తా పడి యువకుడు..
రామాయంపేట, వెలుగు : ఆటో బోల్తాపడి ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన రామాయంపేట మండలం సుతారిపల్లి గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగింది. ఎస్సై బాలరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన భానుచందర్ (24) ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. శనివారం రాత్రి తన అమ్మమ్మ ఊరైన సుతారిపల్లికి వస్తున్నాడు. గ్రామ శివారులోని పోచమ్మ గుడి వద్దకు రాగానే అడవి పంది అడ్డు రావడంతో ఆటో బోల్తా పడింది. దీంతో భానుచందర్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి తండ్రి నర్సింలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.