
- కలెక్టరేట్ముట్టడికి యత్నించిన ఏబీవీపీ నాయకులు
హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలంటూ ఏబీవీపీ నాయకులు బుధవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం కలెక్టరేట్ మెయిన్ గేట్ఎదుట ఆందోళనకు దిగగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినా, కొంతమంది లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా ఏసీపీ దేవేందర్ రెడ్డి అక్కడికి చేరుకొని, సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి, ఠాణాకు తరలించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ ప్రాంత కార్య సమితి సభ్యుడు ఆరెపల్లి సుజిత్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి, యూనివర్సిటీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మహానగర్ కార్యదర్శి తాళ్లపల్లి అరుణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రవణ్, భరత్, శ్రీజ, హరిచరణ్, శ్రీకాంత్, రోహిత్, సర్దార్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.